అండర్ వరల్డ్ డాన్ కన్నుమూత.. బ్యాంకు ఉద్యోగి నుంచి మాఫియా డాన్గా.. ముతప్ప రాయ్ ప్రస్థానం ఇదే..
మాజీ అండర్ వరల్డ్ డాన్,సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచాడు. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తాను ఐదేళ్లకు మించి బతకనని వైద్యులు తనకు ముందే చెప్పారని ఈ ఏడాది జనవరిలో ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ముతప్ప రాయ్ వెల్లడించాడు. ఐదు బుల్లెట్లు తన శరీరంలోకి చొచ్చుకెళ్లినా బతకగలిగానని.. చావు గురించి తనకు భయం లేదని.. ధృఢ సంకల్పమే తనను బతికిస్తోందని చెప్పుకొచ్చాడు. ముతప్ప రాయ్ మరణం నేపథ్యంలో ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం అండర్ వరల్డ్ డాన్ వరకు ఎలా సాగిందో చాలామంది గుర్తుచేసుకుంటున్నారు.
వియత్నాం యుద్ధాన్ని మించిన విధ్వంసం: రికార్డులు బద్దలు: మిగిలింది వరల్డ్ వార్-2, సివిల్ వార్ మాత్రమే
బ్యాంకు ఉద్యోగి నుంచి అండర్ వరల్డ్ డాన్ వరకు..
30 ఏళ్ల పాటు బెంగళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలిన ముతప్ప రాయ్ విద్యావంతుడు,అందగాడు,సోఫిస్టికేటెడ్. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన విజయ బ్యాంకులో ఉద్యోగిగా తన కెరీర్ మొదలుపెట్టాడు. 1980'ల చివరలో బెంగళూరు అండర్ వరల్డ్తో రాయ్కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1990లో ఒకానొక రోజు అప్పటి గ్యాంగ్స్టర్,పొలిటీషియన్ ఎంపీ జైరాజ్ను పట్టపగలే ముతప్ప రాయ్ హత్య చేయడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ హత్యతో బెంగళూరు మాఫియా సామ్రాజ్యానికి బాస్గా ఎదిగిన ముతప్ప రాయ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
బంత్ కమ్యూనిటీ..
1991లో కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక సరీళకరణ విధానాల నేపథ్యంలో బెంగళూరులో పెరిగిన రియల్ ఎస్టేట్ బూమ్పై పట్టు బిగించాడు. ఈ క్రమంలో రెండుసార్లు ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఓ కేసుకు సంబంధించి ఓరోజు బెంగళూరు కోర్టుకు హాజరవగా.. ప్రత్యర్థులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ముతప్ప రాయ్కి ఐదు బుల్లెట్లు దిగాయి. ముతప్ప రాయ్,కర్ణాటకలోని అగ్ర కులాల్లో ఒకటైన బంత్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఐశ్వర్య రాయ్,శిల్పా శెట్టి,సునీల్ శెట్టి.. వీరంతా ఆ కమ్యూనిటీకి చెందినవారే. అందుకే 'మిస్ వరల్డ్ టూ అండర్ వరల్డ్.. ప్రతీచోటా బంత్స్దే ఆధిపత్యం..' అన్న ఓ నానుడి కూడా పుట్టుకొచ్చింది.
దావూద్ డీ గ్యాంగ్తో పరిచయం..
1990ల్లోనే ముతప్ప రాయ్కి మాఫియా డాన్ దావూద్ గ్యాంగ్తో పరిచయం ఏర్పడింది. మంగళూరులోని బంత్ కమ్యూనిటీకే చెందిన శరద్ శెట్టి అనే డీ కంపెనీ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి తో ముతప్ప రాయ్కి స్నేహం కుదిరింది. శరద్ శెట్టి దుబాయ్ నుంచి డీ కంపెనీ ఆపరేషన్స్ చేస్తుండేవాడు. బెంగళూరులో అప్పటికే పలు హత్య కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ముతప్ప రాయ్ 1996లో దుబాయ్కి పారిపోయి అతని వద్ద తలదాచుకున్నాడు.
రాయ్పై రాంగోపాల్ వర్మ సినిమా..
2000వ సంవత్సరంలో దుబాయ్ ప్రభుత్వం ముతప్ప రాయ్ను భారత్కు అప్పగించింది. దీంతో కొన్ని నెలలు అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అదే సమయంలో తనపై ఉన్న అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకొచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు శివారుకు తన అడ్డాను మార్చి అక్కడినుంచే కార్యకలాపాలు సాగించాడు. ఇదే క్రమంలో జయ కర్ణాటక అనే ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా చాలామంది పేద ప్రజలకు సహాయం చేశాడని చెబుతారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముతప్ప రాయ్ జీవిత కథ ఆధారంగా కన్నడలో వివేక్ ఒబేరాయ్ హీరోగా 'రాయ్' అనే సినిమా కూడా తెరకెక్కించాడు. మొత్తం మీద చాలా ఏళ్లు బెంగళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలిన ముతప్ప రాయ్ గురువారం కన్నుమూశాడు.