వధువు బట్టలిప్పించి!: మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఘోర అవమానం..
వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు.
కాన్పూర్: మరికొద్ది గంటల్లో పెళ్లి తంతు పూర్తవుతుందనగా.. ఓ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వధువుకు సంబంధించి కొన్ని వదంతులు వ్యాపించడంతో.. ఆమెను వివస్త్ర చేసి మరీ వరుడు తరుపు ఆడపడుచులు తనిఖీలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో.. వధవుకు ల్యూకోడర్మా అనే చర్మ వ్యాధి ఉందన్న వదంతులు వ్యాపించాయి. విషయాన్ని వరుడి తరుపువారికి చెప్పకుండా దాచారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగ్గా.. పంచాయితీ కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆమెకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని తేలడంతో.. తిరిగి పెళ్లి మంటపానికి చేరుకుని, వివాహ తంతు కానిచ్చారు.