గాలిని సునామీతో ఎదుర్కున్నారు: మోడీపై ఉద్ధవ్ థాకరే వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై దేశంలోని ప్రముఖ నాయకుల అభినందనల వెల్లువ కురుస్తోంది. బిజెపి మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా అరవింద్ కేజ్రీవాల్ను అభినందించారు. గాలికి వ్యతిరేకంగా సునామీ వచ్చిపడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ గాలి వీస్తోందనే ప్రచారంపై ఆయన ఆ వ్యంగ్య వ్యాఖ్య చేశారు.
ఢిల్లీ ప్రజలు గాలిని సునామీతో ఎదుర్కున్నారని అన్నారు. ప్రధాని ప్రజాదరణను ఉపయోగించుకుంటూ బిజెపి నరేంద్ర మోడీ గాలి వీస్తోందని ప్రచారం చేసుకుంటూ వస్తోంది. లోకసభ ఎన్నికల్లో బిజెపికి మోడీ గాలి అతి పెద్ద విజయాన్ని సాధించి పెట్టింది. గత 30 ఏళ్లలో అదే అతి పెద్ద విజయం. అయితే, రెండేళ్ల వయస్సు గల పార్టీ బిజెపిని దెబ్బ తీసింది.
ప్రధాని ర్యాలీలు, అమిత్ షా వ్యూహాలు, దాదాపు 120 మంది జాతీయ ప్రజాప్రతినిధులు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని నిలువరించలేకపోయారు. పైగా, అనూహ్యమైన విజయం ఆయనను వరించింది. మహారాష్ట్రలో శివసేన బిజెపి మిత్ర పక్షం. దానికి తోడు, మోడీ ప్రభుత్వంలో కూడా ఆ పార్టీ పాలు పంచుకుంటోంది.
అయితే, ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి శివసేనతో తెగదెంపులు చేసుకుంది. మహారాష్ట్రలో బిజెపికి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. దాంతో శివసేన బిజెపికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. చివరకు రెండు పార్టీలు కూడా అవగాహనకు వచ్చాయి.