అర్నబ్ వీడ్కోలు ప్రసంగం : 'టైమ్స్ నౌ' సహచరులతో ఏం చెప్పాడు? (వీడియో)
న్యూఢిల్లీ : తన వ్యాఖ్యానంతో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న ప్రముఖ ఎడిటర్ అర్నబ్ గోస్వామి 'రాజీనామా' వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్నబ్ రాజీనామాకు సంబంధించి ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో హల్-చల్ చేస్తోంది.
అర్నబ్ గోస్వామి సంచలన నిర్ణయం : 'టైమ్స్ నౌ'కు రాజీనామా!
అర్నబ్ రాజీనామా వేళ.. 'టౌమ్స్ నౌ' టీమ్ అంతా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్బంగా అర్నబ్ భావోద్వోగపూరిత ప్రసంగం చేశారు. తాను లేకపోయినా టీమ్ లో మాత్రం తన స్ఫూర్తి నిలిచి ఉండేలా పలు వ్యాఖ్యలు చేశారు. 'ఆట ఇప్పుడే మొదలైందంటూ' అర్నబ్ చేసిన ఆ ప్రసంగం ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మీడియాలో స్వతంత్రంగా వ్యవహరించడం గురించి ఎవరూ బోధించరని, ఎవరికి వారు ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని, మీడియా స్వేచ్చపై నమ్మకం కోల్పోవద్దని అర్నబ్ తన సహచరులకు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో భాగంగా తాను నోరు పారేసుకున్నవారికి ఈ సందర్బంగా అర్నబ్ క్షమాపణలు చెప్పారు. చానెల్ ను అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆలోచనతోనే తానలా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.
టైమ్స్ నౌ లో తాను స్వేచ్చగా పనిచేయడానికి సహచరులే కారణమంటూ వారిని ప్రశంసించారు అర్నబ్. పదేళ్ల పాటు టైమ్స్ నౌ ను అంతా తానై నడిపించిన అర్నబ్, ప్రస్తుతం తానే సొంతంగా ఓ మీడియా చానెల్ ను నెలకొల్పే పనిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది కార్పోరేట్ వ్యక్తులు ఇప్పటికే ఆయనతో టచ్ లో ఉన్నారన్న ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి అర్నబ్ మున్ముందు ఎటువైపు అడుగులు వేస్తారో!