రోడ్ సేఫ్టీ బిల్లు: ఏప్రిల్ 30న దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ బంద్కు పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న రోడ్ సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతోన్నాయి. ఈ బిల్లుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పలు ట్రాన్స్పోర్టు సంస్థలు, ఆటో యూనియన్లు, కార్మిక సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈమేరకు సంస్థలన్నీ గురువారం(ఏప్రిల్ 30న) దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్టు బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ బంద్కు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్(ఏఐఆర్టిడబ్ల్యూ) ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కాగా, ఈ బంద్లో సిఐటియుసి, ఏఐటియుసి, ఐఎన్టీయుసి, బిఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐసిసిటియు, ఇండింపెండెంట్ స్టేట్ యూనియన్స్, ఎల్ పిఎఫ్(తమిళనాడు), యుపి రోడ్ వేస్ కర్మచారి సంయుక్త్ పరిషద్, గుజరాత్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఎన్ఎల్ఓ, ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కర్మచారి సంయుక్త పరిషద్, తెలుగు రాష్ట్రాలకు చెందిన యూనియన్లు పాల్గొంటున్నాయి. దీంతో గురువారం దేశంలోని అన్ని నగరాలతోపాటు హైదరాబాద్ నగరంలోనూ రవాణా నిలిచిపోనుంది.
బిల్లు సరికాదు: వెనక్కి తీసుకోవాలి
దేశ వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ బంద్కు రాష్ట్రంలోని టీఎంయూతో పాటు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించాయి.
రోడ్ సేఫ్టీ బిల్లు ధనిక, అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే పని చేస్తోందని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఎందుకంటే అక్కడ రోడ్లు చాలా బాగుంటాయని, మన దేశంలోలా ఉండవని వివరించారు. ముందు ఇక్కడ ఉన్న రోడ్ల వ్యవస్థను బాగు చేయకుండా రోడ్ సేఫ్టీ బిల్లును తేవడం సరికాదన్నారు.
రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు 2014
ఈ బిల్లు అమలులోకి వస్తే రవాణా నిబంధనలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో డ్రైవింగ్లో తప్పులు జరిగితే జరిమానాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు సిగ్నల్ జంప్కు మామూలుగా రూ. వందల నుంచి వేలలో జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఓవర్ స్పీడ్కు రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు జరిమానా పెరిగే అవకాశం ఉంది.
ఇలా జరిమానా పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు. దీనిపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరిగితే తమ బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ముందు రోడ్లను బాగుపరచాలని తర్వాతే ఇలాంటి చట్టాలు తేవాలని కోరుతున్నారు.
ఇప్పుడున్న డ్రైవింగ్ లైసెన్స్లను పూర్తిగా రద్దు చేసి అందరూ మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకోవాలనే నిబంధన కూడా తెచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. అయితే ఈ బిల్లును పాస్ చేయించడానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో యేటా రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు పది వేల మంది వరకు చనిపోతున్నారని మంత్రి గడ్కరీ ఇప్పటికే పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా గురువారం జరగనున్న బంద్లో 7.5 లక్షల మంది కార్మికులు పాల్గొననున్నారు.