నా ప్రాణం పోయినా రాష్ట్రం ముక్కలు కాదు, తండ్రి, కోడుకుల స్వార్థం: బీజేపీ నో, బెంగళూరు!
బెంగళూరు: సమైక్య కర్ణాటక ముక్కలు కావడానికి తాను అంగీకరించనని, చివరి శ్వాస ఉన్నంత వరకు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యకుండా అడ్డుకుంటానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యద్యూరప్ప అన్నారు. సమైక్య కర్ణాటకకు బీజేపీ కట్టుబడి ఉందని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
తండ్రీ కోడుకుల ప్లాన్
మంగళవారం హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మీద మండిపడ్డారు. జేడీఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి తండ్రీ కోడుకులు కర్ణాటకను ముక్కలు చెయ్యడానికి సిద్దం అయ్యారని యడ్యూరప్ప ఆరోపించారు.
ఏ సీఎం చెయ్యలేదు
కర్ణాటక ఏకీకరణ (సమైక్య కర్ణాటక) అయిన తరువాత కర్ణాటకను విభజించాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నాలు చెయ్యలేదని యడ్యూరప్ప గుర్తు చేశారు. అయితే స్వార్థం కోసం ముఖ్యమంత్రి కుమారస్వామి ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి జేడీఎస్ పార్టీకి లబ్ధిచేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు.
అన్నం, ఉద్యోగాలు
కర్ణాటక మొత్తానికి అన్న పెడుతున్నది ఉత్తర కర్ణాటక అన్నదాతలు అని, ఆ ప్రాంతానికి బడ్జెట్ లో ఒక్క పైసా ఇవ్వలేదని యడ్యూరప్ప అన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తి చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చెయ్యలేదని యడ్యూరప్ప ఆరోపించారు.
నీచంగా మాట్లాడిన సీఎం
బెంగళూరు నుంచి వస్తున్న పన్నులు ఉత్తర కర్ణాటకకు ఎలా కేటాయిస్తానని సీఎం కుమారస్వామి ఆ ప్రాంత ప్రజలను అవమానించారని యడ్యూరప్ప ఆరోపించారు. నాకు మీరు ఏమైనా ఓటు వేశారా ? మీ డిమాండ్లు పరిష్కరించడానికి అంటూ సీఎం కుమారస్వామి ఉత్తర కర్ణాటక ప్రజలను అవహేళనగా మాట్లాడారని యడ్యూరప్ప ఆరోపించారు.
నేను సీఎం పని చేస్తున్నా
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రాంతాలకు చెందిన వందల మంది స్వామీజీలు బెళగావిలో ఆందోళన చేస్తున్నారని, సీఎం కుమారస్వామి అక్కడికి వెళ్లి వారికి నచ్చచెప్పకుండా బెంగళూరులో కుర్చున్నారని, స్వామీజీలకు నచ్చచెప్పడానికి తాను వెలుతున్నానని, సమైక్య కర్ణాటక కోసం సీఎం చేసే పని తాను చేస్తున్నానని యడ్యూరప్ప అన్నారు. తండ్రీ కోడుకులు కేవలం వారి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, తనతో పాటు ప్రజలు కూడా అందుకు అంగీకరించరని యడ్యూరప్ప అన్నారు.