రైలులో నుంచి యువకుడ్ని తోసేసిన టీసీలు
మథుర: కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడ్ని తోసేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కోసికలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బాధితుడు సంజయ్ రాథోడ్ తన కాలును కోల్పోయాడు.
ఆయన ఝాన్సీ నుంచి ఆగ్రా వెళ్లేందుకు యూపీ జన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తన టిక్కెట్టును తనిఖీ అధికారులు (టీసీలు) తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దుర్ఘటన జరగడానికి టీసీలే కారణమని సంజయ్ తెలిపాడు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆ సమయంలో ఆ మార్గంలో విధులు నిర్వర్తించిన వారిని విచారిస్తామని ఎన్సీఆర్ ప్రాంతీయ రైల్వే మేనేజరు ప్రభాత్ కుమార్ వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఘటనపై కాంగ్రెస్ నేత ప్రదీప్ మాథూర్ మాట్లాడుతూ.. ఇది చాలా క్రూరమైన నేరమని అన్నారు. యువకుడిని రైలు నుంచి తోసేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని అసెంబ్లీ పేర్కొంది.