ఉత్తరకొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక: గాల్లోనే క్షిపణిని పేల్చేసి..
ఈ ప్రయోగం సఫలం కావడంతో ఉత్తరకొరియాకు అమెరికా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లయింది. మార్ష్హాల్ ద్వీపంలోని రోనాల్డ్రీగన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సైట్ నుంచి మంగళవారం నాడు ఈ ఖండాంతర క్షిపణిని .
వాషింగ్టన్: యుద్దం ఎప్పుడొచ్చినా.. అందుకు సిద్దంగా ఉండేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. తద్వారా ఉత్తరకొరియాకు ధీటైన హెచ్చరికలు జారీ చేసింది. ఒక డమ్మీ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి.. తమ రక్షణ వ్యవస్థలోని మరో క్షిపణితో దాన్ని పేల్చేసి పరీక్షించారు.
ఈ ప్రయోగం సఫలం కావడంతో ఉత్తరకొరియాకు అమెరికా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లయింది. మార్ష్హాల్ ద్వీపంలోని రోనాల్డ్రీగన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సైట్ నుంచి మంగళవారం నాడు ఈ ఖండాంతర క్షిపణిని అమెరికా ప్రయోగించింది. అనంతరం కాలిఫోర్నియాలోని వెండెన్బర్గ్ ఎయిర్ఫోర్స్ స్థావరం నుంచి ది గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ (జీఎండీ) నుంచి మరో క్షిపణి ద్వారా దాన్ని చేధించారు.
కిల్ వెహికల్గా పేర్కొనే ఐదడుగుల క్షిపణి లక్ష్యాన్ని చేధించిందని నావికదళ వైస్ అడ్మిరల్ జిమ్ సైరింగ్ తెలిపారు. అమెరికా రక్షణ వ్యవస్థలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైందన్నారు. నిజానికి గతేడాదే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం నిర్దేశించిన మరిన్ని ప్రమాణాల మేరకు ప్రయోగంలో ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రతీ ప్రయోగంలోను తాము రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు.