జర్మన్ వింగ్స్ విమానం కో పైలట్ ఉన్మాదం: పైలట్ కాఫీలో మూత్రం డ్రగ్
జర్మనీ: విషాదకర జర్మన్వింగ్స్ విమాన ప్రమాద ఘటన విచారణలో కో-పైలట్ లుబిట్జ్ ఉన్మాద చర్యల మీద రోజుకో కథనం వస్తుంది. లుబిట్జ్ కంప్యూటర్ డేటాను విశ్లేషిస్తున్న విచారణాధికారులు వివరాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాక్పిట్ నుంచి పైలట్ను బయటకు పంపేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే డ్రగ్ను (డైయురెటిక్) అతని కాఫీలో కలిపి ఇచ్చాడని అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్ గురించి చాలా సెర్చ్ చేసినట్టు డేటా విశ్లేషణలో తేలింది.
అంతేకాకుండా, కాక్పిట్ డోర్ లోపలి నుంచి లాక్ చేసుకుని బయటనుంచి తీసే అవకాశం లేకుండా సేఫ్టీ సిస్టమ్ను ఎలా యాక్టివేట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా రోజులుగా ఇంటర్నెట్లో వెతుకుతున్నట్లు స్పష్టమైంది. సహజంగా ఈ వ్యవస్థను ఉగ్రవాదులు విమానాలు హైజాక్ చేసినపుడు విమాన గమనాన్ని ఉగ్రవాదులు కంట్రోల్ చేయకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ ఉద్దేశంతోనే కాక్పిట్ లాకింగ్ సిస్టమ్ను రూపొందించారు.
అయితే, దాన్ని లుబిట్జ్ మరోపనికి వినియోగించాడు. ఆత్మహత్య చేసుకోవటంపై కూడా లుబిట్జ్ చాలా సెర్చ్ చేసినట్లు తెలిసింది. విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయేందుకు ముందు కాక్పిట్ లాక్ చేసుకుని 8 నిమిషాల సేపు కో-పైలట్ నిశ్శబ్దంగా ఉన్నట్లు బ్లాక్బాక్స్ రికార్డు ద్వారా అర్థమైంది. ఇవన్నీ చూస్తుంటే మానసికస్థితి సరిగా లేని కో-పైలట్ లుబిట్జ్ ఈ తరహా ప్రమాదానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది.
28 సభ్య దేశాలు విమానాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు తెలపాలంటూ ఐరోపా దేశాల విమాన భద్రత సంస్థ (ఈఏఎ్సఏ) చేసిన సూచనలను జర్మన్ వింగ్స్ విస్మరించింది. శిక్షణ సమయంలో లుబిట్జ్ కొన్ని నెలలు సెలవు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవటంతో మందులు వాడినట్లు తెలిసినా జర్మన్వింగ్స్ యజమాని లుఫ్తాన్సా సంస్థ ఈ విషయాన్ని దాచిపెట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి.