మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం
న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలలా యూసఫ్ జాయ్కి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. నేషనల్ కాన్ట్సిట్యూషన్ సెంటర్ 'అమెరికా లిబర్టీ మెడల్' అవార్డుతో ఆమెను సత్కరించింది.
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ లిబర్టీ పతకాన్ని మాలలా యూసఫ్ జాయ్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల స్వాతంత్య హక్కుల పోరాటం చేసే వారికి ఏటా ఈ పతకాన్ని గౌరవ సూచకంగా అందిస్తారు.
అవార్డుతో పాటు రూ. 61 లక్షలు ఆమెకు దక్కాయి. అయితే, ఈ మొత్తాన్ని పాకిస్థాన్లో చదువు కోసం మలాలా విరాళమిచ్చింది. గతంలో ఈ పతకాన్ని అందుకున్న ప్రముఖుల్లో జార్జి బుష్, బిల్ క్లింటన్, నెల్సన్ మండేలా, కోఫి అన్నన్ ఉన్నారు.
17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. లక్షల మందికి చదువు ఎంత కష్టపడితేకానీ సమకూరదో తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఎదుర్కొన్న సాహసోపేత అనుభవాన్ని ప్రపంచంలోని నిరక్షరాస్యులైన బాలలందరికీ తెలియచేయాలని తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో విడుదల చేసింది.
తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె నిరుడు ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్నారు.