భూమికి సమీపంలో మరో ‘సూపర్ ఎర్త్’... నీరు, జీవం ఉండే అవకాశం!
మన భూమికి సమీపంలోనే మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన భూమి కన్నా ఏడు రెట్లు పెద్దది.
వాషింగ్టన్: మన భూమికి సమీపంలోనే మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన భూమి కన్నా ఏడు రెట్లు పెద్దది. సౌర కుటుంబం వెలుపల జీవం ఉనికికి సంబంధించి జరుగుతోన్న అన్వేషణలో ఇదొక చక్కని ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిన్నారు.
ఈ గ్రహం మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎల్హెచ్ఎస్ 1140బీ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. మాతృతార చూట్టు ఉండే 'గోల్డీలాక్స్ జోన్'లో ఈ 'సూపర్ ఎర్త్' ఉంది. ఫలితంగా ఆ గ్రహం పై ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
వారి అంచనాల ప్రకారం ఆ భూగ్రహంపై నీరుంటే.. జీవం మనుగడకు కూడా అవకాశమున్నట్లే. గతంలో కూడా గోల్డీలాక్స్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలను కనుగొన్నారు.
అయితే ఎల్హెచ్ఎస్ 1140బి పరిస్థితి వేరు. ఆ గ్రహ పరిభ్రమణ కాలం 25 రోజులే. భూమి నుంచి పరిశీలించినప్పుడు దాని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆ గ్రహాన్ని నిశితంగా గమనించగలిగారు.
ఎల్హెచ్ఎస్ 1140బి గ్రహం ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహానికి దాని మాతృతారకు మధ్య దూరం, భూమికి సూర్యుడికి మధ్య దూరంతో పోలిస్తే 10 రెట్లు తక్కువ.
సౌర కుటుంబంలో ఏదైనా గ్రహం ఇంత చేరువగా ఉంటే తీవ్రమైన వేడి వల్ల దాని ఉపరితలంపై ఉన్న నీటిని పోగొట్టుకునేది. కానీ ఈ గ్రహం మాతృతార మన సూర్యుడి కన్నా చిన్నగా ఉండి, తక్కువ ఉష్ణోగ్రతను వెలువరిస్తోంది. అందువల్ల భూమితో పోలిస్తే ఈ సూపర్ ఎర్త్ సగం ఉష్ణోగ్రతనే అందుకుంటోంది. అందువల్ల దానిపై నీరు పూర్తిగా ఆవిరి అయిపోకుండా మిగిలే ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.