కాషాయ మోడీ, నేపాలీ హృదయాలు గెలిచారు(పిక్చర్స్)
ఖాట్మాండ్: నేపాల్లో శతాబ్దాల క్రితం వెలసిన ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సందర్శించి, మహా శివునికి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర దినమైన శ్రావణ అష్టమి (సోమవారం) రోజున మోడీ ఈ దేవాలయంలో సుమారు 45 నిముషాల పాటు గడిపారు.
ఈ రోజు ఉదయం పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నాకు దేవుడి అనుగ్రహం లభించిందని మోడీ తరువాత ట్విట్టర్లో పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం నేపాల్కు వచ్చిన మోడీ చివరి రోజయిన సోమవారం అయిదో శతాబ్దం నాటి పశుపతినాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సంవత్సరం మేలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నేపాల్కు రావడం ఇదే మొదటిసారి. ఖాట్మండుకు వాయవ్య దిశలో మూడు కిలో మీటర్ల దూరంలో గల దేవపటన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున వెలసిన ఈ దేవాలయానికి మోడీ 2,500 కిలో గ్రాముల గంధపు చెక్కలను విరాళంగా అందజేశారు.
నరేంద్ర మోడీ
మోడీ నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో 150 మంది పూజారులు పాల్గొన్నారు. మోడీ మహాశివునికి రుద్రాభిషేకం చేశారని, పంచామృత స్నానం చేయించారని తరువాత ఒక పూజారి తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన మోడీ కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు.
నరేంద్ర మోడీ
పశుపతినాథ్ ఆలయం వంటి మరో ఆలయం ఎక్కడా లేదని, ఇది ప్రత్యేకమైనదని మోడీ ఆలయంలోని విజిటర్స్ బుక్లో రాశారు. పశుపతినాథ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఒక్కరేనని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ
ప్రత్యేక పూజల సందర్భంగా తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, భారత్-నేపాల్లను కలిపి ఉంచుతున్న పశుపతినాథ్ అనుగ్రహం ఇరు దేశాల ప్రజలకు మున్ముందు కూడా కొనసాగాలని ప్రార్థించానని మోడీ ఆ పుస్తకంలో రాశారు.
నరేంద్ర మోడీ
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి ఆయన లోకసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. పశుపతినాథ్ దేవాలయంలో అనేక మంది భారతీయ పూజారులు ఉన్నారు.
నరేంద్ర మోడీ
ఈ దేవాలయంలోని పూజారుల్లో ఒక ప్రధాన పూజారి, నలుగురు పూజారులు దక్షిణ భారత దేశానికి చెందిన వేద పండితులు ఉండాలనేది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మోడీ ఆలయానికి చేరుకోగానే 108 మంది వేదాలు పఠిస్తూ ఆయనకు స్వాగతం పలికారు.
నరేంద్ర మోడీ
అనంతరం ప్రధాన పూజారి మోడీతో ప్రత్యేక పూజలు చేయిస్తుండగా, 21 మంది వేద పండితులు పవిత్రమైన ‘రుద్రి'ని పఠించారని పశుపతి ఏరియా డెవలప్మెంట్ ట్రస్ట్ చీఫ్ గోవిందా టాండన్ తెలిపారు.
నరేంద్ర మోడీ
ప్రత్యేక పూజల అనంతరం దక్షిణ భారత దేశానికి చెందిన ఆలయ ప్రధాన పూజారి గణేశ్ భట్టా... నరేంద్ర మోడీకి తీర్థ ప్రసాదాలు పెట్టారు.
నరేంద్ర మోడీ
పశుపతినాథ్ ఆలయం ఆవరణలో గల బాశుకి ఆలయంలో మోదీ విడిగా పూజలు చేశారు. ఈ ఆలయంలో ఆయన పళ్లు, గంధపు చెక్కలను అందజేశారు.
నరేంద్ర మోడీ
పశుపతినాథ్ ఆలయ ఆవరణలో గల డజనుకు పైగా ఆలయాలలో మోడీ ప్రార్థనలు చేశారు. మోడీని చూడటానికి ఆలయం వెలుపల పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. మోడీ రాక సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో మీడియా ప్రతినిధులు చేరుకున్నారు.
నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీతో చర్చల అనంతరం నేపాల్ మావోయిస్టు పార్టీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. మోడీని యూసీపీఎన్(ఎం) నేతలు ప్రచండ, బాబు రాం భట్టారిలు కలుసుకున్నారు. మోడీ.. నేపాలీల హృదయాలను గెలుచుకున్నారని బీజేపీ నేతలు చెప్పారు.
నరేంద్ర మోడీ
మోడీ నేపాలీలో మాట్లాడి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నేపాల్ రాజ్యాంగ సభలో నేపాలీ భాషలో మాట్లాడి ఆ దేశ ప్రజలు, ప్రజా ప్రతినిధుల హృదయాలను గెలుచుకున్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ సభలో ప్రసంగాన్ని ఆయన నేపాలీలోనే ప్రారంభించారు. చాలా కాలం కిందట తాను యాత్రికుడిగా నేపాల్ వచ్చానని గుర్తు చేశారు. మోడీ ప్రసంగాన్ని మావోయిస్టు నేత ప్రచండ సహా నేపాల్లోని రాజకీయ నాయకులంతా ముక్తకంఠంతో కొనియాడారు. ఆయన ప్రసంగం మనసులకు హత్తుకునేలా ఉందని, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.