బండి సంజయ్పై 10 కేసులు.. రిమాండ్ రిపోర్టులో చేర్చిన పోలీసులు
బండి సంజయ్ కుమార్పై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఆదివారం కోవిడ్ నిబంధనలకు సంబంధించి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దానితో సహా మరో పది కేసులను చూపించారు. డిజాస్టర్ మేనెజ్మెంట్ యాక్ట్ సహా 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కేసుల వివరాలు ఉన్నాయి.
పరారీలో 11 మంది
అంతకుముందు బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 17వ తేదీ వరకుబండి సంజయ్తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీశ్లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది, మరో 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు.
జీవో రద్దు అని
317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ ఆదివారంరాత్రి కరీంనగర్లోని తన కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలు అమలవుతున్న కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నోటీసు జారీ చేసినా ఆయన వినలేదు. నిన్న రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మూడు గంటల హై డ్రామా మధ్య బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నాం బండి సంజయ్ను కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్ధానం 14 రోజుల రిమాండ్ విధించింది.
ఖండించిన బీజేపీ పెద్దలు
బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బండి సంజయ్పై గతంలో ఉన్న పాత కేసులను, ఐపీసీ సెక్షన్ 333ను పెట్టడాన్ని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. బండి సంజయ్కు పూర్తి మద్దతు ఇస్తామని, పార్టీ జాతీయ అధ్యుక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బండి చేస్తున్న దీక్షను ప్రశంసించారు. కేసుల గురించి చూసుకుంటామని భరోసా ఇచ్చారు. శాంతియుతంగా కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్ను అరెస్ట్ చేయడం, కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయడం సరికాదని నడ్డా అన్నారు.