కాటేసిన కరెంట్: పెళ్లి లారీకి విద్యుత్ షాక్, ఏడుగురు మృతి
హైదరాబాద్: అప్పటిదాకా పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపారు. అంతా కలిసి తిరుగు పయనమయ్యారు. కానీ దారి కాచిన మృత్యువు వారిని కబళించింది. విద్యుత్ తీగలు యమపాశాలై ఏడుగురు ప్రాణాలు కబళించిన ఘోర సంఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగుల్వాడిలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్తో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే రాంసింగ్ తండాకు చెందిన శివ అనే యువకుడి వివాహం నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ సమీపంలోని ఓ గిరిజన తండాలో జరిగింది.
వివాహం అనంతరం లారీలో బంధువులతో కలిసి వరుడి తరపు వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దెగుల్వాడీ దేవ్లా తండా సమీపంలోకి రాగానే కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లు లారీకి తగిలాయి. దీంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా మార్గం మధ్యలో మరొకరు మృతిచెందారు.
మృతిచెందిన వారిలో పెళ్లి కుమారుడి తండ్రి ధన్షీరాం (50), వినోద్ (25), శ్రీను (20), లవ్ (20), రాములు (45), అశోక్జాదవ్ (20) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కిస్కిబాయి (25)ని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రథమ చికిత్స కోసం క్షతగాత్రుల్ని అంబులెన్స్లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించారు. ఈ ప్రమాదంపై మంత్రి హరీష్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించేందుకు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని, మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు.
క్షతగాత్రులకు హైదరాబాద్లోని యశోద, కామినేని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హరీష్రావు చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. అప్పటి వరకు బాజాభజంత్రీలతో, చుట్టాలతో సందడిగా ఉన్న ధన్షీరాం ఇల్లు రోదనలతో నిండిపోయింది.