ఫోన్ కాల్స్పై ఎసిబి అధికారులు అడిగారు: ప్రదీప్, జిమ్మిపైనా..
హైదరాబాద్: తమకేమీ తెలియదని, తెలిసింది మాత్రమే చెప్పగలుగుతామని, చాలా మందితో తమకు పరిచయాలున్నాయని, అన్ని పార్టీల నేతలు మాట్లాడుతుంటారని ఓటుకు నోటుకు కేసులో తెలుగు యువత నేతలు ఎసిబి అధికారులతో చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా నలుగురు తెలుగు యువత నేతలు ప్రదీప్, పుల్లారావు యాదవ్, సుధీర్, మనోజ్లతోపాటు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలను రెండోరోజు ఏసీబీ అధికారులు విచారించారు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ మొదలైంది. తొలుత వేర్వేరుగా విచారించిన అధికారులు మధ్యాహ్న భోజన సమయంలో అందరినీ ఒకేచోట కూర్చుండబెట్టి ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కార్యాలయ ఆవరణలో బయటకు పంపారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. తర్వాత మరోసారి వారిని పిలిచి వేర్వేరుగానూ కలిపి మాట్లాడారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ఐదుగురు బయటకు వచ్చారు.
జిమ్మి విషయమే మాట్లాడారు: పుల్లారావు యాదవ్
ఓటుకునోటు కేసు వెలుగు చూసిన తర్వాత తాను జిమ్మితో తాను మూడుసార్లు మాట్లాడినట్లు ఏసీబీ అధికారుల వద్ద కాల్స్ వివరాలు ఉన్నాయని తెలుగుయువత నేత పుల్లారావు యాదవ్ మీడియాకు చెప్పాడు. ఫోన్కాల్స్ ఆధారంగా రేవంత్రెడ్డి, జిమ్మితో ఉన్న సంబంధాలు, చాలా మంది గురించి మాట్లాడారని తెలిపాడు. తనకు తెలిసిన పూర్తి సమాచారం తెలిపానన్నాడు.
ఫోన్ కాల్స్పైనే ప్రశ్నించారు: ప్రదీప్
తన ఫోన్ కాల్ వివరాలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయని, దాని ఆధారంగానే విచారించాలని మరో తెలుగు యువత నాయకుడు ప్రదీప్ తెలిపాడు. మే 31 తర్వాత మాట్లాడిన కాల్స్ ఆధారంగా విచారించారని, మరోసారి పిలుస్తామనీ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారని అన్నాడు. రెండు రోజుల విచారణలో ఏసీబీ అధికారులు ఏం సమాచారం రాబట్టారో తనకు తెలియదన్నారు. రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేందర్రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి పలుసార్లు రాఘవేందర్రెడ్డి సెల్ఫోన్తో పలువురితో మాట్లాడినట్టు ఏసీబీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఫోన్కాల్స్పై రాఘవేందర్రెడ్డిని మంగళవారం ఏసీబీ అధికారులు ప్రశ్నించగా, కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మాట్లాడి ఉంటాడని చెప్పిట్టు తెలిసింది. మిగతా ఇద్దరు తెలుగు యువత నాయకులు సుధీర్, మనోజ్లను కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించారు. మే 31వ తేదీ తర్వాత వీరిద్దరు పలువురితో మాట్లాడిన ఫోన్కాల్స్పై ఏసీబీ అధికారులు ఆరా తీశారు.