అభంగపట్నం దళితులపై దాడి: ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్ట్?
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ నేత భరత్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భరత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

మొరం అనుమతులు, తవ్వకాలపై నిలదీయడంతో గ్రామానికి చెందిన లక్ష్మణ్, రాజేశ్వర్లపై భరత్ రెడ్డి దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కలకలం రేపిన విషయం తెలిసిందే. చేత కర్రపట్టుకుని బెదరింపులకు గురిచేస్తూ.. బురదనీళ్లగుంటలో నిల్చోబెట్టాడు. వాళ్లు ఎంత వేడుకున్నా..వినలేదు. అంతేగా. భరత్ రెడ్డి రాయలేని భాషల్లో బూతులు తిట్టిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో కన్నెర్ర చేసిన దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో వారం క్రితం లక్ష్మణ్, రాజేశ్వర్ హైదరాబాద్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అయితే ఇదంతా దొరల రాజ్యం సినిమా షూటింగ్లో భాగమని లక్ష్మణ్, రాజేశ్వర్ చెప్పడంతో అంతా నిజమనుకున్నారు. అయితే లక్ష్మణ్, రాజేశ్వర్ అభంగపట్నం చేరుకున్నాక తమను భరత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని, ప్రాణాలు కాపాడుకునేందుకే అలా సినిమా షూటింగ్ అని చెప్పామని చెప్పారు.
భరత్ రెడ్డిపై ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులు భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాగా, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications