డీజీపీ మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ .. వాటి రక్షణ కోసం తానే నేరుగా అంటూ సవాల్ !!
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై బిజెపి ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. గో రక్షకులను అరెస్ట్ చేయాలంటే ముందు తనని అరెస్ట్ చేయాలని డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజా సింగ్. తెలంగాణ పోలీసులు ప్రజల భద్రతను గాలికి వదిలేసి బక్రీద్ పండుగను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
ముదురుతున్న పవర్ వార్ : సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాం, పవర్ ప్లాంట్స్ వద్ద భారీగా పోలీస్ బలగాలు
హైదరాబాద్ స్లీపర్ సెల్ లకు, ఉగ్రవాదులకు, బాంబు ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని పేర్కొన్న రాజాసింగ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి గో రక్షకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన ఆయన పోలీస్ అధికారులు ఆవులను కోతకు పోకుండా అడ్డుకున్న వారిపై కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కోతకి వెళ్లే ఆవులను ఆపి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చే వారిపై కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, కోతకు వెళ్లే ఆవులను కాపాడుకోవడం కోసం తానే నేరుగా వెళ్తానని చెప్పిన రాజా సింగ్ దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. తన జీవితం గోరక్షణ కోసమేనని, గోవులను కాపాడుకుందాం అని తేల్చి చెప్పిన రాజా సింగ్ తెలంగాణ డిజిపి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవులు, ఎద్దులను మూగ జీవాలను కాపాడాల్సిన పోలీసులు ఆ పని చెయ్యటం లేదన్నారు.
అక్రమంగా ఎవరైనా వాటిని కోతకు తీసుకెళ్తే సహించేది లేదని వార్నింగ్ ఇవ్వకుండా వాటిని కాపాడే గోరక్షకులపై కేసులు పెడతామని చెప్పడం, వారిపై చర్యలకు మీటింగ్ పెట్టుకోవడం సరైనది కాదని రాజాసింగ్ మండిపడ్డారు. పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాదులోని ముఖ్యంగా పెరిగిపోతున్న ఉగ్రవాదులపై దృష్టి పెట్టకుండా ఎంఐఎం కోసం, బక్రీద్ పండగ బాగా చేయడం కోసం ప్రత్యేకమైన దృష్టిసారిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.