చీఫ్ జస్టిస్ కంటతడి కలచివేసింది: ఇంద్రకరణ్, వినూత్నంగా కొత్త హైకోర్టు: బాబు
న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల పట్ల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ కంటతడి పెట్టించడం తమ మనసు కలచివేసిందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం అన్నారు. చాలా కేసుల్లో దాదాపు నిందితులు పదిహేనేళ్లుగా జైల్లో ఉంటున్నారని చెప్పారు.
అయినప్పటికీ వారి పైన ట్రయల్స్ జరుగుతున్నాయని సీజే చెప్పారన్నారు. కేసుల పరిష్కారం కన్నా ఏటా కేసులు 50 శాతం పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కోర్టులు, జడ్జిల సంఖ్య పెంచడం అవసరమని చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
న్యాయవ్యవస్థ సంస్కరణల పైన ఢిల్లీలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు చీఫ్ జస్టిస్ ఠాకూర్, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
వినూత్నంగా కొత్త హైకోర్టు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త హైకోర్టు రాబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కొత్త హైకోర్టును విభిన్నంగా నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సమస్యల పైన చీఫ్ జస్టిస్ యాక్షన్ ప్రోగ్రాం రూపొందించారని చెప్పారు.
హైకోర్టులు, ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం పైన చర్చ జరిగిందని చెప్పారు. న్యాయశాఖలో సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించామని చెప్పారు. ఒక్కో సమస్య పైన చీఫ్ జస్టిస్ యాక్షన్ ప్రోగ్రాం రూపొందించారని చెప్పారు.
ఏడు, ఎనిమిది అంశాల ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారని చెప్పారు. జ్యూడిషియల్ సిస్టమ్ మొత్తం కంప్యూటరైజేషన్ పైన చీఫ్ జస్టిస్ మాట్లాడారని చెప్పారు. కమర్షియల్ కోర్టుల అంశం పైన కూడా చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. కోర్టుల్లో ఖాళీలపై ప్రతి ఏటా పది శాతం ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారన్నారు.