గ్రూపు రాజకీయాలతో హీటెక్కుతోన్న టీ-టీడీపీ.. : 'రమణ వర్సెస్ రేవంత్..!'
హైదరాబాద్ : ఇప్పటికే తెలంగాణలో చాలా వరకు ఖాళీ అయిపోయిన తెలుగు దేశం పార్టీలో అంతర్గత విబేధాలు కలకలం రేపుతున్నాయి. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవడంతో తెలంగాణలో పార్టీని ముందుండి నడిపించే విషయంలో నేతలకు ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం రేవంత్ రెడ్డి దీక్ష చేయడం, ఆ దీక్షకు టీటీడీపీ ముఖ్య నేతలంతా దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.
48 గంటల పాటు రేవంత్ రెడ్డి చేసిన దీక్షకు అన్ని జిల్లాల నుంచి పార్టీ కార్యవర్గమంతా హాజరైనా.. పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు మాత్రం దీక్షకు దూరంగానే ఉండిపోయారు. దీనికి కారణమేంటన్నది గమనిస్తే.. టీటీడీపీలో రెండుగా చీలిపోయిన గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణమన్న సమాధానం వినిపిస్తోంది.
పార్టీ కార్యచరణ విషయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతోనే రేవంత్ దీక్షకు రమణ దూరంగా ఉండిపోయారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రేవంత్ దీక్షను ఆయన ఏకపక్ష పోకడలకు నిదర్శనమని ఆరోపిస్తోన్న రమణ వర్గీయులు అసలు రేవంత్ దీక్షకు చంద్రబాబు మద్దతు లేనే లేదని విమర్శిస్తున్నారు.
కాగా, దీక్ష సందర్బంగా.. చంద్రబాబు పేరు గానీ, ఆయనకు సంబంధించిన కటౌట్లు బ్యానర్లు గానీ దీక్షాస్థలిలో ఏర్పాటు చేయలేదు. దీంతో అధినేతను సైతం పక్కనబెట్టి రేవంత్ రాజకీయాలు చేస్తున్నారని రమణ వర్గం ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే విషయాన్ని రమణ అనుచరులు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, చంద్రబాబును విస్మరించే ఆలోచన తమకు లేదని, తెలంగాణ కోసం ముందునుంచి పాటు పడిన ప్రముఖుల ఫోటోలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే దీక్షాస్థలిలో వాళ్ల ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేశామని రేవంత్ వర్గం చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
రేవంత్ వ్యవహారంపై తీవ్ర అసహనంతో ఉన్న రమణ వర్గం రేవంత్ దీక్షను రద్దు చేయడానికి చాలా ప్రయత్నాలే చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం చంద్రబాబు ద్వారా మంతనాలు జరిపిన నేతలు ఆఖరికి దీక్షను రద్దు చేయడంలో మాత్రం విఫలమయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సైతం రేవంత్ ని టార్గెట్ చేసుకుని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎవరికి వారే కార్యచరణ రూపొందించుకుంటున్నారని తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని ఆయన చంద్రబాబు దగ్గర వాపోగా.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు చంద్రబాబు.
మొత్తానికి రేవంత్ దీక్ష టీటీడీపీలో కలహాలను మరోసారి బయటపెట్టినట్టయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య ధోరణో.. సమన్వయ లోపమో.. గానీ కలిసి పనిచేయాలని అధినేత చంద్రబాబు సూచించినా ఆయన మాటన పెడ చెవినే పెడుతున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు.