తగ్గని కెసిఆర్: ఎవరేమనుకున్నా ఆ పదవి గుత్తాకే....
రాజకీయ చాతుర్యానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గ్రామీణ తెలంగాణంలో తన పట్టు కాపాడుకునేందుకు.
హైదరాబాద్: రాజకీయ చాతుర్యానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గ్రామీణ తెలంగాణంలో తన పట్టు కాపాడుకునేందుకు తన, పార్టీ రాజకీయ భవితవ్యాన్ని పదిలపర్చుకునే దిశగా కాంక్రీట్గానే ముందుకు సాగుతున్నట్లు సంకేతాలిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రైతుకు ఎకరానికి రూ.4000 చొప్పున వ్యవసాయానికి ఆర్థిక సాయం రెండు సీజన్లలో ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగానే ముందడుగు వేస్తున్నారని తెలుస్తున్నది.
దీంతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు, గిడ్డంగుల వసతులు కల్పించేందుకు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు భారీగా నామినేషన్ ప్రక్రియలో చేపట్టిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర సమన్వయ కర్తగా సారథ్యం బాధ్యతలు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి అప్పగించడం ఖాయమని తేలింది.
ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర రైతు సమాఖ్య బాధ్యతలను ఆయనకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు, ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ చక్కగా అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని చెప్పారు. రైతు సమాఖ్య ఛైర్మన్ పదవిపై విస్తృతస్థాయిలో ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు.
ఎవరేమనుకున్నా...
ఆదివారం ప్రగతిభవన్లో పాడి రైతులతో జరిగిన సమావేశం తర్వవాత సీఎం కేసీఆర్ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, జోగు రామన్న, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రసమయి బాలకిషన్, ప్రభాకర్రెడ్డి, గ్యాదరి కిశోర్, వేములవీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ రైతు సమాఖ్య గురించి మాట్లాడారు. సమాఖ్యపై ప్రసార మాధ్యమాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోందని వాఖ్యానించారు. ఎవరేమి అనుకున్నా గుత్తాకే సమాఖ్యను నిర్వహించే సమర్థత ఉందని తేల్చేశారు. విజయ దశమి తర్వాతే రైతు సమాఖ్య చైర్మన్ నియామకం జరిగే వీలున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే జోడు పదవులపైనా సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది.
రాజీనామా తర్వాతే నియామకం ప్రచారం నిజం కాదన్న సీఎం
రైతు సమన్వయ సమితి ఏర్పాటుపై ఆర్డినెన్స్ తర్వాత చట్టం?ఎంపీ పదవికి రాజీనామా చేయించాకే గుత్తాకు పదవి ఇస్తారనే ప్రచారం వాస్తవం కాదని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సమాఖ్య ఏర్పాటు విషయమై తొలుత ఆర్డినెన్స్ ఇస్తామని, తర్వాతే దానిపై చట్టం చేస్తామని వెల్లడించారు. సమాఖ్యకు రాజకీయ రంగు పులిమేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సమావేశానికి హాజరైన నేతలకు సూచించారు. రైతు సమాఖ్యలకు విస్తృతమైన పరిధి ఉంటుందని పేర్కొన్నారు. గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా, ఎన్నికలు వస్తాయా అనే విషయాలను సీఎం కేసీఆర్ మాట్లాడలేదు.
అయితే ఈ సందర్భంగా జోడు పదవుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో కేవీపీ రామచంద్ర రావు ఎంపీగానూ, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని.. ఎంపీలు ఆదికేశవులునాయుడు, కనుమూరి బాపిరాజు ఎంపీలుగా ఉంటూనే తిరుమల - తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవులను అధిష్ఠించారని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ సత్తా చాటవచ్చునని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రాజకీయ అంశాలపై మాట్లాడలేదని వినికిడి. ఆర్డినెన్స్ అంశంపై నేతలు, న్యాయనిపుణులతో చర్చించారు.
ఏపీలో ఏడు మండలాల విలీనం మాదిరిగా వ్యవహరిస్తారా..
అయితే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విషయమై ఇప్పటివరకు ఎటువంటి చట్టబద్దత గురించి మాట్లాడకుండా గోప్యంగా వ్యవహరించడం సందేహాలకు తావిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజంగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటునకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావించి ఉంటే అసెంబ్లీలో నేరుగా చట్టం చేసేందుకు అవసరమైన బలం కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ముందుగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరమేమీ లేదు.
అయితే తాజాగా సీఎం కేసీఆర్ నోటి వెంట ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పడమే అనుమానంగా ఉన్నది. గతంలో 2014లో తెలంగాణ ఏర్పాటుకు ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేసుకునేందుకు ఆగమేఘాల మీద కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చి మరీ ఏపీ సీఎం చంద్రబాబు ఆర్డినెన్స్ జారీ చేయించారు. తర్వాత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు ఆమోదించి, పాత తేదీ నుంచి చట్టం అమలు చేస్తున్నట్లు తర్వాత జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి తాజాగా తెలంగాణ సొంత రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్ అనుసరించే అవకాశాలు ఉన్నాయా? అని విశ్లేషకులు సందేహిస్తున్నారు.
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని కొట్టేసిన హైకోర్టు
టీటీడీ చైర్మన్ పదవిని ఎంపీలుగా ఆదికేశవులు నాయుడు, కనుమూరి బాపిరాజు వ్యవహరించినా అది లాభదాయక పదవి కిందకు రాలేదు. గతంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సలహా కమిటీ చైర్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. లాభదాయక పదవుల్లో ఉన్నారని కేసు నమోదు కావడం, న్యాయస్థానం తప్పుబట్టడంతో ఆమె తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా కొన్ని పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగించారు. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల్లో కొందరిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది.
ఇది లాభ దాయక పదవుల నియామకమేనని న్యాయస్థానం తీర్పు చెప్పడంతో వారు అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు. ఇటు తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్ రెడ్డికి రైతు సమన్వయ సమితి సమన్వయకర్త పదవి అప్పగిస్తే.. అందుకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే లాభదాయక పదవే అవుతుంది. దీనికి నిధులు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి. ఇటువంటి పరిస్థితుల్లో కేబినెట్ హోదాతో సమానమైన ఆ పదవిని చేపట్టాలంటే తప్పనిసరిగా గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్న విషయం మున్ముందు తేలనున్నది.