ప్రత్యూషకు కేసీఆర్ ఫోన్ నెంబర్, కీసర మహిళా వసతి గృహానికి తరలింపు
హైదరాబాద్: చిన్న వయసులో ఎన్నో కష్టాలను అనుభవించిన ప్రత్యూష బుధవారం నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఈరోజు నుంచి ఆమెకు తెలంగాణ ప్రభుత్వమే అన్ని రకాలుగా రక్షణ వహించనుంది. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను అధికారులు కీసరలోని మహిళా వసతి గృహానికి తరలించారు.
అంతకముందు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి తీసుకురాగా కేసీఆర్తో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే. తన నివాసానికి వచ్చిన ప్రత్యూషను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బాగా చదివి పైకి రావాలని ప్రత్యూషకు సూచించారు. నిన్ను కష్టపెట్టిన వారికి ఇదే నీవు వేసే శిక్ష అని చెప్పారు. అంతేకాదు ప్రత్యాషకు సీఎం కేసీఆర్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఎప్పుడైనా ఇంటికి రావొచ్చని చెప్పారు.
ప్రత్యూష చదువు బాధ్యత ప్రభుత్వానిదేని స్పష్టం చేశారు. ప్రత్యూష ఉన్నత విద్యకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి సీఎం అదేశాలు జారీ చేశారు. ప్రత్యూష చదువు, వసతిపై ఎప్పటికప్పుడు తెలుసుకుని అండగా నిలవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీని ఆదేశించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రత్యూషకు రూ. 5 లక్షళు మంజూరు చేశారు. ఆమె పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బును అందులో జమ చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ప్రత్యూష చాలా సంతోషపడింది.