ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి, నో కామెంట్: కవితపై డీఎస్, 'అప్పటి నుంచే మార్పు'
Recommended Video
హైదరాబాద్: తనపై నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్ బుధవారం తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్ ఎంపీ కవిత, జిల్లా పార్టీ నేతలు ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. డీఎస్ తన అనుచరులతోను భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
డీ శ్రీనివాస్ పైన నిప్పులు చెరిగిన కేసీఆర్ కూతురు కవిత
ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నిర్ణయాలపై తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని, నో కామెంట్ అన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదని చెప్పారు. అంతేకాదు, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదని చెప్పారు.
ఏం నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు
జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని డీ శ్రీనివాస్ అన్నారు. ఆ విషయం వారినే అడగాలన్నారు. వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని, నా గొంతు కోస్తామని అనలేదు కదా అని వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధి కోసమే పని చేశానని స్పష్టం చేశారు.
కేసీఆర్ నుంచి డీఎస్కు పిలుపు
తాజా పరిణామాల నేపథ్యంలో డీ శ్రీనివాస్కు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. డీఎస్ నిన్ననే (మంగళవారం) కేసీఆర్ అపాయింటుమెంట్ కోరగా ఈ రోజు ముఖ్యమంత్రిని కలవాలంటూ సీఎం కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. నిన్న మాత్రం అపాయింటుమెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నేతలు తనపై చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చే అవకాశముంది.
అందుకే డీఎస్ను చేర్చుకున్నారు
డిఎస్ పైన నిజామాబాద్ జిల్లా తెరాస నేతలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఎంపీ కవిత సహా నేతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని, మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లోనూ గెలిపించి అధికారంలోకి రావడానికి సహకరించారని, అందుకే ఈ జిల్లా అంటే కేసీఆర్కు చెప్పలేనంత అభిమానమని కవిత చెప్పారు. ఆ కారణంతో జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న డీఎస్ పార్టీలోకి వస్తానంటే కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారన్నారు.
అప్పటి నుంచే డీఎస్ ప్రవర్తనలో మార్పు
అంతర్రాష్ట్ర సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా కల్పించారని కవిత గుర్తు చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం కల్పించారని, సీఎం ఆదేశాల మేరకు జిల్లా నేతలంతా ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారన్నారు. అయితే ఇటీవల డీఎస్ కుమారుడు బీజేపీలో చేరారని, అప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని, తన కుమారుడు ఉన్న పార్టీకి అనుకూలంగా పని చేయాలంటూ గత కొద్ది నెలలుగా డీఎస్ పార్టీ కార్యకర్తలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కార్యకర్తలు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు.
డీఎస్ అయినా మీరు సహించవద్దు.. కేసీఆర్కు కవిత
డీఎస్ వల్ల కింది కేడర్ ఇబ్బందులు పడుతున్నందునే తాము బయటకు రావాల్సి వచ్చిందని కవిత చెప్పారు. కుటుంబంలో అభిప్రాయ బేధాలుంటే ఆయన వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని, అంతేగానీ పార్టీని నాశనం చేసేలా వ్యవహరించకూడదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానానికి తెలియజేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా తెరాస అధ్యక్షురాలు తుల ఉమకు విజ్ఞప్తి చేస్తున్నామని, తమ ఆవేదనను తెలియజేస్తూ కేసీఆర్కు లేఖ రాశామని, పార్టీకి వ్యతిరేకంగా తన బిడ్డలు వ్యవహరించినా కఠినచర్యలు తప్పవని కేసీఆర్ తరుచూ హెచ్చరిస్తుంటారని, డీఎస్ వ్యవహారంలోనూ అలాగే ఉండాలని కోరుతున్నామన్నారు. పార్టీలో ఇలాంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్ జిల్లా మొత్తం టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు. పార్టీలో ఎంతటి నేతలైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించవద్దని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.