హెచ్సిఏ గ్రామీణ క్రికెటర్లను నిర్లక్ష్యం చేస్తోంది: క్యాట్ అధ్యక్షుడిగా దానం(ఫొటోలు)
హైదరాబాద్: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. క్యాట్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, వి. ప్రకాశ్, మర్రి ఆదిత్య రెడ్డి, కార్తీక్ రెడ్డిలు ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు ఉండే ఈ కమిటీలో ఆయనతోపాటు పలువురు రాజకీయ, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ కమిటీ వివరాలను బుధవారం బుధవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో క్యాట్ నూతన కార్యవర్గం వివరాలను క్యాట్ వ్యవస్థాపక కార్యదర్శి కొలన్పాక సునీల్ బాబు ప్రకటించారు. క్యాట్ సంయుక్త కార్యదర్శులుగా శ్రీరామ్ చక్రవర్తి, అనిల్కుమార్ యాదవ్, రాజ్కుమార్, కోశాధికారిగా మేజర్ కిరణ్లకు చోటు దక్కింది.
మాజీ రంజీ ఆటగాడు పవన్కుమార్ చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... హెచ్సిఏ 1932లో ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎలాంటి క్రికెట్ బోర్డు ఏర్పడలేదన్నారు.
బిసిసిఐ నుంచి భారీస్థాయిలో నిధులు అందుకుంటున్న హెచ్సీఏ గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే క్యాట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించడంతోపాటు వారి ప్రతిభను దేశానికి పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.