నయీంతో లింక్స్: వెనక్కి తగ్గిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి, ఎందుకు?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో సంబంధాల ఆరోపణలపై మీడియా సమావేశం పెట్టాలనే ఆలోచనను మాజీ డిజిపి దినేష్ రెడ్డి విరమించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలు ఇచ్చిన సలహాలతో ఆయన మీడియా సమావేశం ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు
గ్యాంగస్టర్ నయీంతో ఓ మాజీ డిజిపికి సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనెవరనే విషయంపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో దినేష్ రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల మీద దినేష్ రెడ్డి ప్రతిస్పందించే అవకాశాలున్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.
నయీంకు ఓ మాజీ డిజిపి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని, భూములు కూడా కొనిపెట్టారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇద్దరు అల్లుళ్లకు కూడా నయీం పనిచేసి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. నయీంతో హైదరాబాదుకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా భూదందాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.
నయీం డైరీల ఆధారంగా నాగిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నయీం కేసును విచారిస్తోంది. డైరీలోని విషయాలను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ నుంచి వరంగల్కు వెళ్లే మార్గంలో 350 ఎకరాల భూమి సెటిల్మెంట్ చేసిన నయీం, ఆ స్థలం నుంచి 250 ఎకరాలు మాజీ మంత్రికి ఇచ్చి, వంద ఎకరాలు తాను ఉంచుకున్నట్టు తన డైరీలో చెప్పినట్లు సమాచారం.
అప్పటి ప్రభుత్వంలో ఆ మంత్రి ఎంత చెబితే అంతే నడవడంతో నయీం సూచించిన పోలీసులకు మంచి పోస్టింగ్లు కూడా వచ్చాయని, అధికారులు కూడా ఏది చెప్పినా తల ఊపుతూ చేశారని నయీం తన డైరీలో స్పష్టంగా పలుమార్లు రాశాడు. వీరిద్దరి స్నేహానికి గుర్తుగా పక్కపక్కనే ఫామ్హౌస్లు కూడా నిర్మించుకున్నారు. నయీంతో మాజీ మంత్రికి ఉన్న సంబంధాలు డైరీ ద్వారా వెలుగుచూడటంతో పోలీసులు విచారణ దిశగా ఆలోచనలు ప్రారంభించారు.
అయితే, డైరీలో సమాచారం మేరకు వాస్తవ ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. తొలుత రెండు ఫామ్హౌస్లు, ఆ తర్వాత సంబంధించిన ఆధారాలు పక్కాగా సేకరించి, ఆ మాజీ మంత్రిని విచారించాలని భావిస్తున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. నయీం తన డైరీలో రాసుకున్న ప్రతీ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఆ సమాచారంతో పక్కాగా ఆధారాలు కూడా సేకరించేందుకు ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయన్నారు.
లైంగిక వాంఛ తీర్చలేదని ఇద్దరిని, భూ దందాకు సంబంధించి వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు వ్యక్తులను నయీం హతమార్చినట్టు తాజా విచారణలో వెలుగుచూశాయి. లైంగిక వాంఛ తీర్చలేదన్న కారణంతో హైదరాబాద్లోని అల్కాపురి నివాసంలో 16 ఏండ్ల లోపు ఇద్దరు బాలికను అత్యంత కిరాతకంగా చంపినట్టు విచారణలో నయీం అంతరంగీకురాలు ఫర్హానా వెల్లడించింది.
నయీంతోపాటు తాను కూడా ఆ బాలికలను కత్తులతో పొడిచి చంపానని ఫర్హానా చెప్పినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలు మూడు నెలల క్రితం నయీం బెడ్రూమ్లోనే జరిగినట్టు ఆమె బయటపెట్టిందన్నారు. ఓ భూ తగాదా విషయంలో ఓ ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి అల్కాపురికి తీసుకొచ్చాడని, భూ పత్రాలపై సదరు యజమానులు సంతకాలు పెట్టకపోవడంతో వారిని తన నివాసానికి సమీపంలోనే సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపినట్టు ఫర్హానా వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో నయీం కేసులో ఐపీసీ 302 సెక్షన్ను కూడా చేర్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.