వేర్వేరుగా దర్యాఫ్తు: డా.శశికుమార్ కాల్పుల ఘటన సిసిఎస్కు బదలీ
హైదరాబాద్: హిమయత్ నగర్లో గత నెల 8వ తేదీన జరిగి డాక్టర్ కాల్పులు, ఆత్మహత్య కేసును డిజిపి అనురాగ్ శర్మ.. సోమవారం నాడు సిసిఎస్కు బదలీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లు వేర్వేరుగా దర్యాఫ్తు చేస్తున్నాయి.
శశికుమార్ కాల్పులు జరిపిన హిమయత్ నగర్ ఓ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అతను ఆత్మహత్య చేసుకున్న మొయినాబాద్ మరో కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు వేర్వేరుగా దర్యాఫ్తు చేస్తున్నాయి.
దీనిపై శశికుమార్ సతీమణి ఇటీవల డిజిపిని కలిశారు. ఈ కేసును ఒకే ఏజెన్సీ కింద విచారణ జరిపించాలని ఆమె డిజిపిని కోరారు. ఈ నేపథ్యంలో డిజిపి తాజాగా ఈ కేసును సిసిఎస్కు బదలీ చేశారు. దీనిని ప్రత్యేక టీం దర్యాఫ్తు చేయనుంది.
గత నెల 8వ తేదీన శశికుమార్ డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడే మరో డాక్టర్ సాయి ఉన్నారు. ఆ తర్వాత శశికుమార్ తన స్నేహితురాలు చంద్రకళ కారులో మొయినాబాదులోని ఫాంహౌస్కు వెళ్లిపోయారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన అప్పుడు హైదరాబాదులో సంచలనం రేపింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. శశికుమార్ను హత్య చేసి ఉంటారని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు, ఉదయ్ పైన కాల్పులు జరిపింది శశికుమారేనని నిర్ధారించుకున్నారు. కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.