నకిలీలకు చెక్: సర్టిఫికేట్లలో చిప్ అమర్చే ప్లాన్లో విద్యామండలి, యూనివర్సిటీలు
హైదరాబాద్: పెరిగిపోతున్న నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారాలకు ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నాయి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ), రాష్ట్ర విశ్వవిద్యాలయాలు. ఇందుకోసం జారీ చేసే సర్టిఫికేట్లలో స్మార్ట్ చిప్స్ అమర్చాలని నిర్ణయించాయి.
ఇటీవలి కాలంలో ఫేక్ సర్టిఫికేట్ల కేసులు ఎక్కువగా వెలుగుచూస్తుండటంతో స్మార్ట్ చిప్స్ అమర్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అమలు చేస్తున్న యూనిక్ కోడ్ నెంబర్లు, లోగోలు, వాటర్ మార్క్స్, పేపర్ థిక్నెస్ లాంటివాటిని కూడా నకిలీ సర్టిఫికేట్లు కలిగి వుండటం గమనార్హం. అచ్చం నిజమైన సర్టిఫికేట్లు ఉన్నట్లుగానే ఈ ఫేక్ సర్టిఫికేట్లు కూడా ఉంటుండటంతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నకిలీలకు చెక్ పెట్టే పనులు వేగవంతం చేస్తున్నారు. టీఎస్సీహెచ్ఈ, రాష్ట్ర యూనివర్సీటీలు కలిసి సంయుక్తంగా ఈ చిప్ అమర్చే ప్రక్రియను చేపడుతున్నాయి. డిప్లొమా, అండర్ గ్రాడ్యూయేట్స్, పోస్టు గ్రాడ్యూయేట్స్, ఇతర సర్టిపికేట్ కోర్సులు చేసేవారికి జారీ చేయనున్న సర్టిఫికేట్లలో చిప్స్ అమర్చాలని నిర్ణయించాయి.
స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) అనే కార్యక్రమాన్ని నవంబర్ 18న టీఎస్సీహెచ్ఈ ప్రారంభించింది. దీంతో దాదాపు 20 లక్షల సర్టిఫికేట్లను ఆన్లైన్ ద్వారానే వెరిఫికేషన్ చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు విధాలుగా అంటే వెంటనే, లేదా పూర్తి వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ల తనిఖీ చేస్తోంది. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్నత విద్య కోసం వెళ్లేవారికి ఈ కార్యక్రమం సహాయకంగా ఉండనుంది. అంతేగాక, నకిలీ సర్టిఫికేట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుంది.
ఆన్ లైన్ ద్వారా ఉద్యోగులు, యూనివర్సిటీలు సర్టిఫికేట్ కాపీలను ఫుల్ వెరిఫికేషన్ చేయవచ్చు. యూనివర్సిటీలు ఫిజికల్ ద్వారా కూడా తనిఖీ చేస్తాయి. రూ. 1500 చెల్లించి ఈ విధంగా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాగా, 2010 నుంచి 2021 వరకు 25 లక్షల మంది విద్యార్థులు తమ డిగ్రీని పూర్తి చేసుకోవడం గమనార్హం.