'విత్తనం' వాళ్లను మింగేసింది: ఈ విధ్వంసానికి బాధ్యులెవరు?..
సంగారెడ్డి: దేశానికి తిండి పెట్టే రైతన్నకు ఇప్పుడు దినదిన గండం. అడుగడుగునా అందరూ అతన్ని దగా చేసేవారే. నకిలీ విత్తనాలతో ఏజెంట్లు, కనీస మద్దతు ధర ఇవ్వక ప్రభుత్వాలు, వాళ్ల శ్రమను కష్టాన్ని కారుచౌకగా దోచుకునే దళారులు.. అంతా కలసి రైతన్న రక్తాన్ని పీలుస్తున్నారు.
పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు రైతాంగంపై శీతకన్నుతో వ్యవహరిస్తుండంతో.. ఉరితాళ్లకు వేలాడుతున్న రైతులు ఎందరో. తెలంగాణలో బీజీ-3 విధ్వంసానికి ఇప్పుడు ఎంతోమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
నిండా ముంచిన బీజీ-3:
రైతుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురావు. ఇచ్చినా.. సవాలక్ష నిబంధనలు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పు చేస్తే.. ఆ వేధింపులు వర్ణాతీతం. ఇదిగో ఈ పరిస్థితులే కొన్ని విత్తన కంపెనీలకు కలిసొచ్చాయి.
విత్తనాలను అప్పు కింద ఇస్తామని చెప్పి రైతుల భూములనే ప్రయోగశాలలుగా మారుస్తున్నాయి. అనుమతి లేని విత్తనాలను అంటగట్టి చేతులు దులుపుకుంటున్నాయి. తీరా పంట వేశాక.. దిగుబడి రాక, విత్తన సంస్థల అప్పు తీర్చలేక రైతన్న కుదేలవుతున్నాడు. 'బీజీ-3' పేరుతో తెలంగాణలో రైతన్నలపై ఇలాంటి దగానే జరిగింది.
ప్రయోగాల విషయం తెలియని రైతన్న:
బీజీ-3 (బోల్ గార్డు-3)పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిషేధం కొనసాగుతోంది. అయినా సరే కొన్ని బహుళ జాతి సంస్థలు తమ రహస్య ఏజెంట్ల ద్వారా రైతులను ఏమార్చి ఈ విత్తనాలను విక్రయిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బీజీ-2 పేరుతో బీజే-3 విత్తనాలను కొన్ని వేలమందికి అంటగట్టారు. రాష్ట్రంలో దాదాపు 13లక్షల ఎకరాల్లో బీజీ-3ని సాగుచేయించినట్టు అంచనా. ఏజెంట్లు, ప్రయోగాల విషయం తెలియని రైతన్నలు.. విరివిగా ఈ పంటను సాగుచేశారు.
పూత లేదు.. కాత లేదు..:
బీజీ-3 సాగుచేసిన చోటల్లా చెట్టు ఏపుగానే పెరిగింది. కానీ ఏం లాభం.. ఎక్కడ పూత, కాత లేకుండా పోయింది. ఎకరాకు 50కేజీల నుంచి క్వింటాలు దిగుబడి మాత్రమే ఉందంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో ఇది సాగైంది. దీన్ని సాగుచేసిన రైతులు ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తున్నారు.
లాభపడ్డ డీలర్లు, ఏజెంట్లు:
బీజీ-3 పత్తి విత్తనాలను విక్రయించినందుకు గాను డీలర్లు, ఏజెంట్లు బాగానే సొమ్ము చేసుకోగా.. రైతన్నలే తీవ్రంగా దగా పడ్డారు. సాధారణంగా ఒక్కో విత్తన ప్యాకెట్ పై డీలరుకు రూ.25-రూ.30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ-3 ప్యాకెట్ విక్రయిస్తే మాత్రం రూ.500, అదే లూజ్గా విక్రయిస్తే రూ.1200ల వరకు ఆదాయం వస్తోంది. నిషేధిత విత్తనం కావడంతో కంపెనీలు ఆ స్థాయిలో ముట్టజెప్పుతున్నాయి.
రాలిపోతున్న రైతన్నలు:
కౌలుకు తీసుకుని చేసిన భూముల్లో బీజీ-3 విత్తనాలు నిండా ముంచేయడంతో.. అటు విత్తన అప్పు తీర్చలేక, ఇటు కౌలు డబ్బులు కట్టలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక రైతులు తనువు చాలిస్తున్నారు.
ఒక్క సదాశివపేట మండలంలోనే గడిచిన మూడు నెలల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీజీ-3 దెబ్బకు ఇప్పటివరకు రాష్ట్రంలో 300మంది రైతులు రాలిపోయారని అనధికారిక అంచనా. ఇంత జరుగుతున్నా.. అధికారుల వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం, కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునే చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.