priyank reddy murder: హోంమంత్రి వ్యాఖ్యలపై గీతారెడ్డి ఫైర్
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్లో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతా రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
ప్రియాంక రెడ్డి హత్య : స్టేషన్లోనే వైద్య పరీక్షలు... మాకు అప్పగించాలని స్థానికుల డిమాండ్
ప్రియాంక హత్య ఘటన అందరినీ కలిచివేసిందని గీతారెడ్డి అన్నారు. ప్రియాంక ఘటన మరువక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమని తెలిపారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని అన్నారు.
ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేసివుండాల్సిందంటూ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై గీతారెడ్డి మండిపడ్డారు. ఆ సమయంలో ఏ అమ్మాయి అయినా కుటుంబసభ్యులకే ఫోన్ చేస్తుందని.. అలా జరుగుతుందని ఆమె అనుకుంటుందా? అని ప్రశ్నించారు.
2017లో మహిళల హత్యలు 14శాతం పెరిగాయని ఆమె తెలిపారు. అంతేగాక, మహిళల అక్రమ రవాణా కూడా ఎక్కువగా జరుగుతోందని అన్నారు. తమ కూతురు కనిపించడం లేదంటూ ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు పట్టించుకోలేదని, అంతేగాక, వారితో అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బుధవారం రాత్రి నలుగురు వ్యక్తులు ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసులో ఏ1గా మహ్మద్ ఆరీఫ్(26, ఏ2 జొల్లు శివ(20), ఏ3 జొల్లు నవీన్(20), ఏ4 చింతకుంట చెన్నకేశవులు(20)గా ఉన్నారు.
Recommended Video
కాగా, ప్రియాంక రెడ్డి ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు.. నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నివాసం వద్ద కూడా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కూడా కాల్చివేయాలని డిమాండ్ చేశారు.