తెలంగాణా రైతుల రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కార్
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గుడ్ న్యూస్ చెప్పారు. రుణ మాఫీని మార్చి నెలలోనే చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణలో మార్చి నెల నుంచే రైతు రుణమాఫీ ప్రారంభమవుతుందని ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ అందుకు మార్గదర్శకాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
ఇక దీంతో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిబంధనలను మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చెయ్యటంతో తెలంగాణా రైతాంగం సంతోషంలో ఉంది. ఇక మార్గదర్శకాల జీవో జారీ చేసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఒక లక్ష రూపాయల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్రాప్ లోన్ల లిస్ట్ను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11, 2018 తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు అవుతారని పేర్కొన్నారు . ఇక ఈ రుణాలకు సంబంధించి బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్ట్ను వ్యవసాయ శాఖ అధికారులు సిద్దం చేస్తున్నారు. పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీ లో తీసుకున్న లోన్లు రుణమాఫీకి వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ
ఇక అంతే కాదు ఒక కుటుంబంలో ఒక్కరికే అదీ లక్ష రూపాయల వరకు అయితేనే రుణమాఫీ వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా ఒక్కరి రుణం మాత్రమే మాఫీ అవుతుంది. అది కూడా లక్ష రూపాయల వరకే ఇది వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా మార్చి నెలాఖరుకు 25 వేల రూపాయలలోపు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు. దీంతో రైతన్నలలో సంతోషం నెలకొంది. ఎప్పుడెప్పుడు రుణ మాఫీ వస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతులు సంతోషంలో ఉన్నారు. రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది.












Click it and Unblock the Notifications