రేవంత్! నోరు జాగ్రత్త: గువ్వల, బాబు-జగన్ ఒక్కటయ్యారు: హరీష్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మంగళవారం నాడు మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ నేతలు అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ ప్రభుత్వం పైన చేస్తున్న వ్యాఖ్యలను బాలరాజు తిప్పికొట్టారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చిల్లర రాజకీయాలు చేస్తోన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతోందన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారమైతే రాజకీయ భవిష్యత్ ఉండదనే టీడీపీ, కాంగ్రెస్ నాయకులు డ్రామాలాడుతున్నారన్నారు. పాలమూరును దత్తత తీసుకుని చంద్రబాబు ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. విపక్షాలది కుట్ర పూరిత దీక్ష అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు దురుద్దేశ్యంతో దీక్షలు చేస్తున్నారన్నారు. కొలిక్కి వస్తున్న సమస్యను జఠిలం చేయాలని వారు చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి రావాలన్నారు. ప్రజలను మభ్య పెట్టవద్దన్నారు.
హరీష్ రావు ఆగ్రహం
ఆర్డీఎస్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ది పూటకో మాట.. రాష్ట్రానికో విధానమని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘువీరా రెడ్డి నోరు మూయించాలని సూచించారు.
ఆర్డీఎస్పై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైనా కర్ణాటకతో మాట్లాడారా అని ప్రశ్నించారు. పాలమూరుకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ అన్నారు. పాలమూరు టీడీపీ నేతలకు నిజాయితీ ఉంటే పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవద్దని చంద్రబాబును ఒప్పించాలన్నారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరు ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. ఆర్డీఎస్లో న్యాయమైన వాటా కోసం టీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. మేం కోరుకున్నది.. నీళ్లు, నిజాయితీ, చిత్తశుద్ధి అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోటి ఎకరాలకు సాగునీరిచ్చి తీరుతామన్నారు. ఆర్డీఎస్ పై అప్పుడు, ఇప్పుడు పోరాటం చేస్తున్నది టీఆర్ఎస్ మాత్రమే అన్నారు.