అమ్మో ఒకటో తేదీ, జీతాలను ఎలా తీసుకోవాలోననే ఉద్యోగుల దిగులు
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు బ్యాంకులకు డిసెంబర్ మాసంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రతి ఉద్యోగికి పదివేల రూపాయాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా చెల్లించనున్నారు.
హైదరాబాద్ :;ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు కోసం బ్యాంకులకు తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. పదివేల రూపాయాలను ప్రభుత్వ ఉద్యోగులకు చేతికి ఇచ్చినా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుండి ఎలా డ్రా చేసుకోవాలనే విషయమై ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.ప్రైవేట్ ఉద్యోగులు వేతనాలు తీసుకొనేందుకు బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు రానున్నాయి.
నవంబర్ మాసం బుదవారంతో పూర్తి కానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం ఉదయం బ్యాంకుల ద్వారాపదివేల రూపాయాల నగదును అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన డబ్బును వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ప్రతి ఒక్కరికి పదివేల రూపాయాలను చెల్లించాల్సి వచ్చినా కనీసంగా 1400 కోట్ల రూపాయాలను ఉద్యోగులకు బ్యాంకులు నేరుగా చెల్లించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలోని పదివేల రూపాయాలను తీసుకొనేందుకుగాను ప్రతి బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే రీతిలో సర్కార్ చర్యలను తీసుకొంది. ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలు తీసుకొనేందుకు కష్టాలు పడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారని అంచనా.
ప్రైవేట్ ఉద్యోగులకు వేతనాలను బ్యాంకుల ద్వారానే చెల్లించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ జీతం డబ్బులను బ్యాంకుల నుండి డ్రా చేసుకొనేందుకుగాను బ్యాంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు తప్పవేమో. అయితే ఎటిఎంలు ఎక్కువగా పనిచేసేలా చేస్తే ఇబ్బందికర పరిస్థితులను అధిగమించే అవకాశం ఉంటుంది. కాని, కొత్త కరెన్సీ అందుబాటులో లేని కారణంగా చాలా వరకు ఎటిఎంలు మూతపడే కన్సిస్తున్నాయి. డిసెంబర్ తొలివారంలో బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం లేకపోలేదు.