హెచ్1బి వీసా ప్రకటన చూసి.. నమ్మినందుకు షాక్ తప్పలేదు, లక్షల దోపిడీ!
అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఈ వీసాలను సులువైన మార్గంలో అందిస్తానని దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చాడు.
హైదరాబాద్: ఈజీ మనీకి అలవాటుపడ్డ చాలామంది కన్సల్టెన్సీల పేరుతో అందినకాడికి దోచేస్తున్న ఘటనలు చాలానే బయటపెడుతున్నాయి. తాజాగా నగరంలో హెచ్1బి వీసాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. యాదంరెడ్డి గోపీ అమీర్ పేటలో హెచ్1బీ వీసా కన్సల్టెన్సీ ప్రారంభించాడు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఈ వీసాలను సులువైన మార్గంలో అందిస్తానని దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చాడు. ఇదంతా నిజమేననుకుని నమ్మిన ఖైరతాబాద్ చింతలబస్తీ వాసి బన్నెల వినోద్ కుమార్ హెచ్1బి వీసా కోసం గోపిని సంప్రదించాడు.
దీంతో హెచ్1బి వీసాకు రూ.2లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. నిజంగానే త్వరగా వీసా వచ్చేలా చేస్తారనుకున్న వినోద్.. ఆన్ లైన్ ద్వారా రూ.2లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గోపి ఫోన్ ఎత్తకపోవడంతో వినోద్ లో అనుమానం మొదలైంది.
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. నిందితుడు దమ్మాయిగూడెంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించి విచారణ ప్రారంభించారు.
అమెరికాలో ఉంటున్న వరంగల్ వాసి కార్తీక్ సలహాతోనే ఈ కన్సల్టెన్సీని ప్రారంభించినట్లు తెలిపాడు. దీనికి సహకరిస్తున్న చండీగఢ్ కు చెందిన వ్యక్తి రాజేందర్ కు ఇందులో సగం వాటా ఇచ్చేవాడినని వివరించాడు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.