ప్రేమించకపోతే చంపేస్తా: కిరోసిన్ పోసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ప్రేమోన్మాది చేష్టలను భరించలేక ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన ఓ యువకుడు చాందాటికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో గతేడాదిగా వేధిస్తున్నాడు.
తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు జైనథ్ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం సదరు యువకుడి నుంచి వేధింపులు తగ్గకపోగా మరింతగా ఎక్కువయ్యాయి.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో బాధితురాలి శరీరం 90 శాతం వరకు కాలినట్లు వైద్యలు తెలిపారు.
అనంతరం, అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను హైదరాబాద్కు తరలించారు. తన కుమార్తెను ప్రేమ పేరిట వేధించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.