టీడీపీకి వంటేరు షాక్, అసంతృప్తితో పార్టీకి రాజీనామా: కేసీఆర్ను ఓడిస్తానని సవాల్
గజ్వేల్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేయడానికి దారి తీసిన కారణాలను కూడా ఆయన వివరించారు.
బాబుకు గట్టి షాక్: కేసీఆర్కు చుక్కలు చూపిన వంటేరు కాంగ్రెస్లోకి, ఎర్రబెల్లి అల్లుడు కూడా
వంటేరు ప్రతాప్ రెడ్డి తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా, సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు అనువైన పార్టీలో చేరి ప్రజల పక్షాన నిలబడతానని ఈ సందర్భంగా వంటేరు పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావులు అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు. కానీ, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.
గజ్వేల్లో కేసీఆర్ను ఓడించి తెలంగాణాకు విముక్తి కలిగిస్తానని వంటేరు ప్రకటించారు. గజ్వెల్లో దళితులందరికీ మూడెకరాల భూమిని అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే తానే సీఎం కేసీఆర్కు ఓటేస్తానని, పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఆయనతో పాటు మండలపార్టీ అధ్యక్షులు, టీడీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు ఆయన బాటలోనే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
టీడీపీతో తన బంధం విడదీయలేనిదని, తన సేవలను గుర్తించి అనతికాలంలోనే సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. ఉస్మానియాలో విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు, తనను జైలులో ఉంచినప్పుడు రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుతో నిస్పృహకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీని వీడటం బాధగా ఉందని, రాష్ట్రనాయకత్వం తీరుతో విసుగు చెందానని చెప్పారు. సహృదయంతో తన రాజీనామాను ఆమోదించాలని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.