బాధితుడిగా సిసిఎస్ తలుపు తట్టి నిందితుడిగా..: కళానికేతన్ ఎండి వెనక ఎవరు?
హైదరాబాద్: ప్రముఖ వస్తవ్య్రాపార సంస్థ కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలా కుమార్ మోసాలు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు గుజరాత్, తమిళనాడు, మహరాష్టల్రకు చెందిన పలు బ్యాంకులు, వర్తకులను మోసం చేసినట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు రూ. 150 కోట్లు ముంచినట్టు నిర్థరణకు వచ్చిందని, షాపుల యజమానులకు అద్దె చెల్లించకుండా వేధింపులకు గురిచేసినట్టు చెబుతున్నారు. యజమానులను హింసించి అక్రమ కేసులు బనాయించాడని పలు ఫిర్యాదులు అందాయని సిసిఎస్ ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే 150కోట్ల మోసాలు బయటపడ్డాయని, ఇంకా ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలావుండగా లీలాకుమార్ను సిసిఎస్ పోలీసులు మరో రెండు రోజులు విచారించనున్నట్టు తెలిసింది.
లీలా కుమార్ మోసాల వెనక మాస్టర్ మైండ్ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. కళానికేతన్ మోసాల వెనక మాస్టర్ మైండ్ ఉన్నాడని, తెర వెనుక ఉండి అంతా నడిపించిన ఆ వ్యక్తిని నిందితుల జాబితాలో చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. బాధితుడిగా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించిన లీలాకుమార్ నిందితుడిగా మారి కటకటాల పాలయ్యాడు.
హైదరాబాదులోని షేక్పేటకు చెందిన ఎవిఎన్ రెడ్డి తనను మోసం చేశాడంటూ లీలాకుమార్ సిసిఎస్లో ఫిర్యాదు చేశాడు. అలా బాధితుడిగా వచ్చిన లీలా కుమార్ అసలు ముఖాన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు గుర్తించారు. మరో కేసులో నిందితుడా మార్చి అరెస్టు చేశారు.
వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో తెలిసినవారిని, స్నేహితులను, ఇతర వ్యాపారులను తన ముగ్గులోకి లాగి వారి స్థిరాస్తులపై హక్కులను సాధించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ పత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలను భారీ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత మోసం చేసినట్లు చెబుతున్నారు.
బ్యాంకులను లీలా కుమార్ ఒక్కడే మోసం చేయలేదని, దీని వెనక మరికొంత మంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. నేరాన్ని ప్రేరేపించడం, నేరస్థులకు సహకరించడం, తదితర ఆరోపణల కింద తెర వెనక లీలాకుమార్కు సహకరించిన వ్యక్తిని ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చడానికి సిసిఎస్ పోలీసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికి న్యాయస్థానం అనుమతి అవసరమని చెబుతున్నారు.
ఆస్త్రులపై హక్కులు భుక్తం చేసుకుని, బ్యాంకు రుణాలు పొందడం ద్వారా మాత్రమే కాకుండా దుస్తులు సరఫరా చేసినవారిని కూడా లీలా కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. కళానికేతన్కు దేశవ్యాప్తంగా 21 శాఖలున్నాయి. వీటిలో విక్రయించడానికి అవసరమైన దుస్తులను హోల్ సేలర్ల నుంచే కాకుండా కంపెనీల నుంచి కూడా ఖరీదు చేస్తుంటారు. అలా దుస్తులు సరఫరా చేసిన వారికి లీలా కుమార్ 75 కోట్ల రూపాయల దాకా బాకీ పడినట్లు చెబుతున్నారు.