అక్బరుద్దీన్ కామెంట్స్ రచ్చ..! ఫిర్యాదుల వెల్లువ.. రెచ్చగొట్టలేదంటున్న ఎంఐఎం నేత
హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్బరుద్దీన్ స్పందించారు. తాను రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా నడుచుకోలేదని స్పష్టంచేశారు.
ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను ఆరెస్సెస్ హతమారుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు గతంలో తాను చేసిన 15 నిమిసాల వ్యాఖ్యలపై ఆరెస్సెస్ ఉలిక్కిపడుతోందని గుర్తుచేశారు. పోలీసులు విధుల నుంచి తప్పుకుంటే 15 నిమిషాల్లో 100 కోట్ల భారతీయులను హతమారుస్తామని అక్బర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఖండించాయి. మరోవైపు తాజాగా అక్బర్ వైఖరిపై పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో సైదాబాద్ పోలీసుస్టేషన్లో హిందు సంఘటన్ సంస్థ ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని 153, 153ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అక్బర్పై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దీంతో అక్బరుద్దీన్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్లో తాను ఎవరినీ రెచ్చగొట్టేలా ప్రసంగించలేదని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని కించపరిచేటట్టు మాట్లాడలేదని వివరణలో పేర్కొన్నారు. తాను చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని తెలిపారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాకాల కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు ఊహించుకొని తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరికీనీ కించపరిచేటట్టు మాట్లాడలేదని తేల్చిచెప్పారు.