ప్రతిష్ఠాత్మక చాన్స్: ఓయూ విద్యార్థులపై రాజకీయ వ్యతిరేకత.. సైన్స్ కాంగ్రెస్పై తిరగబడ్డ సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల నిర్వహణపై ఊహించినట్లే జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగాలి. కానీ 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఇంపాల్లోని మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా) నిర్ణయించింది.
మార్చిలో సైన్స్ కాంగ్రెస్ జరుపుతామని అధికారికంగా ప్రకటించింది. మార్చి 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు నిర్వహించనున్నారని విశ్వసనీయ సమాచారం. దీనికి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల పట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకతే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అందువల్లే ఇక నుంచి తాము నిర్వహించే ఏ సమావేశానికైనా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇస్కా షరతు విధించినట్లు సమాచారం. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఉస్మానియా యూనివర్శిటీలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని, సీఎంగా కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని, కనుక సైన్స్ కాంగ్రెస్ నిర్వహించకపోవడమే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల తొలి నుంచి సీఎం కేసీఆర్ వ్యతిరేక భావంతోనే ఉన్నారన్న అభిప్రాయం ఉంది.
ఓయూ, తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బంద్
తాజాగా సదస్సును మణిపూర్ సెంట్రల్ యూనివర్శిటీకి మారుస్తూ ఇస్కా నిర్ణయం తీసుకోవడంతో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల్లో అసంత్రుప్తి, అనిశ్చితి వల్లే సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు గ్యారంటీ ఇవ్వలేమని తేల్చేసిన సీఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వం విమర్శల పాలవుతున్నది. ఉస్మానియా విద్యార్థుల పట్ల రాజకీయవ్యతిరేకత వల్ల ప్రతిష్ఠాత్మక సదస్సు నిర్వహణ అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారన్న విమర్శ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం బంద్కు పిలుపునిచ్చాయి. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ అవకాశం మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి తరలి వెళ్లిందని సమాచారం తెలిసిన వెంటనే ఉస్మానియా వైస్ చాన్స్ లర్ ఎస్ రామచంద్రం తన పదవికి రాజీనామా చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. ఆయనతోపాటు ఓయూ రిజిస్ట్రార్ కూడా రాజీనామా చేశారని కూడా ఆ వార్తల సారాంశం. కానీ తర్వాత తాము రాజీనామా చేయలేదని వీసీ, రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు అది వేరే విషయం. అయితే సీఎం కేసీఆర్ నుంచి మద్దతు పొందారన్న అభిప్రాయం కూడా ఉన్నది. ఏది ఏమైనా సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడినందున విద్యార్థులు, యూనివర్శిటీ ఫ్యాకల్టీ అకడమిక్ అంశాలపై ద్రుష్టి సారించాలని వైస్ చాన్స్ లర్ సూచించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు తమ యూనివర్శిటీ అన్ని విధాల సిద్ధమైందని, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేవారమని తెలిపారు. ఏ కారణాల రీత్యా సదస్సు మణిపూర్కు మళ్లిపోయిందో మాత్రం వివరించలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలని ఇస్కా కొత్త నిబంధన
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించలేమని ఓయూ లేఖ రాయడంతో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన ప్రతిష్ఠాత్మక సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మళ్లీ ఎక్కడ నిర్వహించేది ఈనెల 27న సమావేశమై చెబుతామని ఇస్కా ప్రకటించింది. ఆ మేరకు బుధవారం జరిగిన ఇస్కా ప్రత్యేక సమావేశంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తీరు తెన్నులపై చర్చించిన కార్యవర్గం ఓయూ ఉదంతాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఈ సారి నుంచి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు విశ్వవిద్యాలయాలు ముందుకొస్తే సరిపోదని, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలనే నిబంధన చేర్చారు. వాయిదా పడిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను నిర్వహిస్తామని దేశంలోని ఆంధ్రా విశ్వవిద్యాలంయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేసుకున్నాయి. కొన్ని యూనివర్సిటీలు సమావేశాలకు సహకరించేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని లేఖలు తీసుకొచ్చారు. మణిపూర్ యూనివర్సిటీ మాత్రం ఆ రాష్ట్ర గవర్నర్, సీఎంతో సమావేశమై పూర్తిగా సహకరిస్తామని లేఖ సమర్పించింది. దీంతో మణిపూర్ యూనివర్సిటీకి నిర్వహణ అవకాశం లభించింది. ఇప్పటివరకు 104 సమావేశాలు జరగ్గా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఒక్కసారి 2009లో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో జరిపారు.
ఆత్మ విశ్వాసంలో సమాధానమివ్వలేని ఓయూ ప్రతినిధులు
ఇస్కా మండలిలో ఓయూ నుంచి సభ్యులైన ఆచార్య పార్థసారథి, రెడ్యానాయక్ బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు ఓయూ సిద్ధంగా ఉందని చెప్పినా ఇస్కా అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహిస్తామనే హామీని ఏమైనా ఇస్తారా అని ఇస్కా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దాంతో ఓయూ అధికారులు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పలేకపోయారని తెలిసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఘనంగా జరుపుకునేందుకు అవకాశం దొరికినా... వినియోగించుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఓయూ అడిగినా మళ్లీ అవకాశం దొరకడం కష్టమేనని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్లో సదస్సు నిర్వహణపై ఇస్కా అనాసక్తి
ఓయూలో సమావేశం రద్దు కావడంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న సుమారు 16 వేల మంది రుసుములను ఓయూ అధికారులు తిరిగి చెల్లించాల్సి ఉంది. వాటిని వ్యక్తిగతంగా ఓయూ చెల్లిస్తుందని ఇస్కా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఓయూ ఉపకులతి ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ ఓయూ క్యాంపస్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాయిదా పడిన సమావేశాన్ని ఇక్కడే నిర్వహించేందుకు ఇద్దరు సభ్యులను ఇస్కా సమావేశానికి పంపినట్లు తెలిపారు. అయితే ఇస్కా ఆసక్తి కనబర్చలేదని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉపకులపతి, రిజిస్ట్రార్ రాజీనామా చేశారని వచ్చిన వార్తలు వదంతులని రామచంద్రం సృష్టంచేశారు.