ఏం సంకేతాలు?: ఆంధ్రజ్యోతి ఆఫీసులో కెసిఆర్, రాధాకృష్ణతో సయోధ్య
కెసిఆర్ ఆంధ్రజ్యోతి ఆఫీసును సందర్శించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఫోన్ చేసి ఆరా తీసిన తర్వాత సందర్శనకు వెళ్లాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం చేసిన ఓ పని తెలంగాణలోని పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు రోజుల క్రితం అగ్రిప్రమాదం సంభవించిన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కెసిఆర్ సందర్శించారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వ్యతిరేక వార్తాకథనాలు రాస్తూ వచ్చిన ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయాన్ని కెసిఆర్ అన్నీ మరిచిపోయి సందర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన సంకేతాలేమిటనేది చర్చనీయాంశమైంది. ఆయన మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చి దాదాపు అరగంట పాటు ఉన్నారు.
ఆంధ్రజ్యోతి కార్యాలయంలోని రెండు, మూడు అంతస్థులను ఆయన పరిశీలించారు. ఆయనకు ప్రమాదం జరిగిన తీరును ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, సంపాదకుడు కె. శ్రీనివాస్ వివరించారు. కెసిఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు...
అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ పత్రిక ఆదివారం సంచికను ఎలా తేగలిగారని కెసిఆర్ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రమాదం గురించి వేమూరి రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అయితే, రాధాకృష్ణకూ కెసిఆర్కూ మధ్య గతంలోనే సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. ఆంధ్రజ్యోతికి హైదరాబాదులో ఇంతకు ముందే స్థలాన్ని కూడా కెసిఆర్ కేటాయించారు.
ఫోన్ కూడా చేశారు...
‘ఆంధ్రజ్యోతి' ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారంనాడు సందర్శనకు రావడానికి ముందే ఆరా తీశారు. సోమవారం ఆయన వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు. పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
టిడిపి నేతలు...
హైదరాబాదులోని జూబ్లీహిల్స్లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని మంగళవారం మంత్రి పద్మారావు సందర్శించారు. అగ్నిప్రమాదానికి గురైన అంతస్తులను పరిశీలించారు. ప్రమాద సంఘటనకు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతులు ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి కూడా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చి పరిశీలించారు.
కవిత కూడా అప్పుడే..
రాధాకృష్ణకు కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, సుజనాచౌదరి ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదానికి గురైన రెండు, మూడో అంతస్థులను రాధాకృష్ణతో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
రేవంత్ రెడ్డి సందర్శన..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత రెడ్డి కార్యాలయాన్ని సందర్శించి అగ్ని ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ‘ఆంధ్రజ్యోతి' ప్రధాన కార్యాలయానికి వచ్చి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నోవా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ ఎం. కృష్ణారావు, బొగ్గు గనుల సుబ్బారావు, మెగా కృష్ణా రెడ్డి, కిమ్స్ చైర్మన క్రిష్ణయ్యలు రాధాకృష్ణను కలిసి ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు.