టార్గెట్ రేవంత్రెడ్డి, టిఆర్ఎస్లోకి 'కొడంగల్'! 'ఆంధ్రాపార్టీని ఖతం చేద్దాం'
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మంత్రులు హరీష్ రావు, లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు సమక్షంలో వారు కారు ఎక్కారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
కొడంగల్లో లక్షా ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి తెస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరుకు టిడిపి ద్రోహం చేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్టును వద్దంటున్న టిడిపిని భూస్థాపితం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో టిడిపి మూలాలు పెకిలించి బయటకు రావాలన్నారు.
కొడంగల్ అనే పేరు రాష్ట్రంలో అందరికీ తెలుసునని మరో నేత గుర్నాథ్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ తెలిసేలా చేశారన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్కు చెడ్డపేరు తెచ్చారన్నారు. రేవంత్ను కలిసేందుకు ఆంధ్రా నుండి కొన్ని వేలమంది వచ్చారన్నారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... నాయకులమంతా ఐక్యంగా ముందుకెళ్లి పాలమూరును అభివృద్ధి చేసుకుందామన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణకు కృషి చేద్దామన్నారు.
మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన పాలమూరు జిల్లాకు కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నీరు అందించే పాలమూరు ఎత్తిపోతలను కడుతుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై పాలమూరు ప్రజలంతా ఏకం కావాలన్నారు.
పాలమూరు ఎత్తిపోతలకు చంద్రబాబు అడ్డుపడుతుంటే టిడిపి నేతలు ఆయనకు మద్దతివ్వడం విడ్డూరమన్నారు. ఎత్తిపోతలతో కొడంగల్ నియోజకవర్గంలో లక్షా 8వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. పాలమూరులో ఆంధ్రా పార్టీని ఖతం చేయాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ లేకుండా మనం చూడాలన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ... దమ్మున్న నాయకుడు కెసిఆర్ అన్నారు.
ఇంటింటికి నీరు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగనని చెప్పారన్నారు. కొడంగల్ ప్రజలు టిడిపి మూలాలు పెకిలించి బయటకు రావాలన్నారు. చంద్రబాబు వద్ద పెదవి విప్పని టిడిపి నేతలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. పాలమూరు జిల్లాలో టిడిపి చీడపురుగులను ఏరివేద్దామన్నారు.