ఓటుకు నోటు: కొత్త టీపీసీసీ నియామకంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం, గాంధీభవన్కి రాను
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో రాష్ట్ర పార్టీలో అసమ్మతి నేతలు పార్టీకి దూరమయ్యేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రేవంత్ నియామకంతో పార్టీ నేతలపై విమర్శలు చేసేందుకు వెనుకాడటం లేదు.
Recommended Video

ఓటుకు నోటు కేసు.. టీపీసీసీ చీఫ్ పోస్ట్ అమ్మేశారంటూ కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీకి వెళ్లాక తెలిసిందన్నారు. తెలంగాణ ఇంఛార్జీనే పీసీసీని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇకపై గాంధీభవన్ మెట్లెక్కబోనంటూ కోమటిరెడ్డి..
తాను ఇకపై గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. తాను సోమవారం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తనను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, రేవంత్ రెడ్డి సహా ఎవరూ తనను కలిసేందుకు ప్రయత్నించొద్దని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్యాయమంటూనే చురకలు
హుజూరాబాద్లో రాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ టీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. ఇది టీపీసీసీ కాదని.. టీడీపీ టీపీసీసీ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి ఒకే పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్యాయం జరిగిందని, రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అనుకుంటారన్నారు.

సోనియా, రాహుల్పై విమర్శలు చేయను: కోమటిరెడ్డి
టీపీసీసీ చీఫ్ నియామకం విషయంపై తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించబోనని వ్యాఖ్యానించారు. తాను ప్రజల మధ్యనే ఉంటానని, కొత్త నాయకులను కార్యకర్తలను ప్రోత్సహిస్తానన్నారు కోమటిరెడ్డి. నల్గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపుకోసం కృషి చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఆందోల్ మైసమ్మ గుడి వరకు జాతీయ రహదారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబితేనే మంజూరు చేశానని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్కు రూ. 370 కోట్ల పనులు జరుగుతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications