అమరావతి ఎలా?: సీమాంధ్రులపై రివర్స్లో వచ్చిన కెటిఆర్, బాబుకు చురక
హైదరాబాద్: భాగ్యనగరాన్ని ప్రత్యేకంగా ఎవరూ ప్రపంచపటంలో పెట్టలేదని, ముందు నుంచి ప్రపంచస్థాయి నగరమని మంత్రి కెటి రామారావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ నగరం దేశానికే మణిహారమన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారిని హైదరాబాద్ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు.
హైదరాబాదులో అన్ని సంస్కృతులు కనిపిస్తాయన్నారు. హైదరాబాద్ ఓ మినీ భారతం అన్నారు. భారత దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాదులో ఉన్నారని చెప్పారు. ఘనమైన చరిత్ర హైదరాబాద్ సొంతమని చెప్పారు.
మహాత్మా గాంధీ మెచ్చిన నగరం
చారిత్రకంగా కూడా హైదరాబాద్కు పేరు ఉందన్నారు. నేను కూడా హైదరాబాదులో చదువుకున్నానని చెప్పారు. హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక అని అందరూ చెబుతారన్నారు. హైదరాబాద్ పరమత సహనానికి నిదర్శనం అన్నారు. హైదరాబాద్ది మహాత్మా గాంధీ మెచ్చిన సంస్కృతి అన్నారు.
చంద్రబాబుకు కౌంటర్
తెలంగాణ తమ పరిపాలన వల్లే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని కొందరు చెప్పుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కానీ హైదరాబాద్ రాష్ట్రం మొదటి నుంచి సర్ ప్లస్ రాష్ట్రంగానే ఉందని చెప్పారు. స్వాతంత్రం వచ్చే నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు.
హైదరాబాద్ సంస్థానం సర్ ప్లస్ బడ్జెట్ రాష్ట్రమని చెప్పారు. హైదరాబాదులో 30కి పైగా రక్షణ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాదును కొత్తగా ప్రపంచపటంలో ఎవరూ పెట్టలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
హైదరాబాద్ తనంతట తానే ప్రపంచంలో ఓ ప్రత్యేకత సాధించుకుందన్నారు. దీనిని ఎవరూ ప్రపంచపటంలో పెట్టలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని మూడో వంతు జనాభా హైదరాబాదులోనే ఉందన్నారు. భౌగోళికంగా తెలంగాణలోని పది జిల్లాల్లో ఐదు జిల్లాలు హైదరాబాదులోకి చొచ్చుకు వచ్చాయన్నారు.
హైదరాబాద్ అంటే కేవలం ఓ నగరం కాదన్నారు. హైదరాబాదులోకి నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు చొచ్చుకు వచ్చాయన్నారు. భౌగోళికంగా హైదరాబాద్ విస్తరించిందన్నారు. తెలంగాణ నాటి నుంచి నేటి వరకు మిగులు బడ్జెట్ రాష్ట్రమన్నారు.
వర్షం పడితే.. చెన్నైకి హైదరాబాద్ భిన్నంగా లేదు
ఇటీవల చెన్నైలో వర్షాలు పడితే ఆ నగరం దారుణంగా తయారయిందన్నారు. అరవై దశాబ్దాల సీమాంధ్ర పాలనలో హైదరాబాద్ పరిస్థితి చెన్నై కంటే ఏమైనా భిన్నంగా ఉందా అని నిలదీశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. కాంక్రీట్ బేస్డ్ అభివృద్ధి మాత్రమే జరిగిందన్నారు.
హైదరాబాద్ నలువైపులా విస్తరించేందుకు అవకాశాలున్నాయన్నారు. కానీ గత ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో అన్ని విధాలుగా అభివృద్ధి జరగలేదన్నారు. ఉదాహరణకు ఐటీ అంటే ఓ కొండాపూర్, మాధాపూర్ మాత్రమే గుర్తుకు వస్తుందన్నారు.
విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేమని, అది 24 గంటలు కావాలని, తాగునీరు కావాలని, రోడ్డుపై ట్రాఫిక్ ఉండవద్దని, హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని, అన్ని మౌలిక వసతులు కావాలని.. ఇవే ప్రజలు కోరుకుంటారని, వాటిని నెరవేర్చాలన్నారు.
తాగునీటి విషయంలోను సరైన ప్రణాళిక లేకుండా పోయిందన్నారు. హైదరాబాదును ఎవరూ కొత్తగా ప్రపంచపటంలో పెట్టలేదన్నారు. ఇంత పెద్ద హైదరాబాదులో తాగునీటి విషయంలోను ప్రణాళిక లేకుండా పోయిందన్నారు.
నాడు నిజాం కాలంలో కట్టించిన నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్లే ఉన్నాయన్నారు. హైదరాబాద్ కోసం ఓ మంచినీటి సరస్సు కట్టించాలని మన పాలకులకు రాకపోవడం విడ్డూరమన్నారు. నాలాంటి వారితో సహా నేటి వారికి మూసి అంటే డ్రెయినేజీగానే తెలుసు తప్పితే, నది అని తెలియని విషయమన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో...
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారన్నారు. అరవై ఏళ్ల పాలనలో వేసిన పునాది రాళ్లు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఫ్లై ఓవర్ల మీద రెండో కారు ఆగి పోతే మరో కారు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు.
కానీ తమ ప్రభుత్వం శాశ్వతంగా ట్రాఫిక్ రద్దీని నియంత్రించే విషయంపై దృష్టి సారించిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి తొమ్మిది నెలలు పాలనకు సరిపడే యంత్రాంగం కూడా లేకుండా పోయందన్నారు. మొన్నటి వరకు నేను రెండు పోర్ట్ పోలియోలు చూసుకుంటే.. నా కార్యదర్శి అయిదు పోర్ట్ పోలీయోలు చూశారన్నారు.
సీమాంధ్రూలూ ఆలోచించండి!
తాము మొదటి ఏడాది బాలారిష్టాలు దాటే ప్రయత్నం చేశామని చెప్పారు. తెలంగాణ వచ్చాక, తెరాస అధికారంలోకి వస్తే.. హైదరాబాదులోని మిగతా వారిని బెదిరిస్తారని, వారిని బతకనివ్వరని, వారి ఆస్తులు లాక్కుంటారని తమ పైన విష ప్రచారం చేశారన్నారు.
ఇది పందొమ్మిది నెలల కిందటి మాట అన్నారు. కానీ వారి మాటలను తాము అబద్దం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. తాను చెప్పేదానిని హైదరాబాదీలు అందరూ ఆలోచించాలన్నారు. సీమాంధ్రుల విషయంలో ఎక్కడైనా మరో విధంగా మేం ప్రవర్తించామా ఆలోచించాలన్నారు.
తమ పరిపాలనలో ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రాంతీయ విమర్శ కనిపించిందా అన్నారు. మేం ఎప్పుడైనా విడగొట్టే ప్రయత్నం చేశామా ఆలోచించాలన్నారు. తెలంగాణలోని ఆదాయం ఇక్కడే ఖర్చు పెట్టడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోందన్నారు.
అమరావతి ఎలా వచ్చింది?
ఈ రోజు గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుతుందంటే, అమరావతి అంతర్జాతీయ రాజధానిగా అవుతోందంటే, ఐఐటీలు వస్తున్నాయంటే.. అందుకు కారణం ఏమిటో ఆలోచించాలన్నారు.
సమైక్య ఏపీ ఉంటే.. ఇంకో ఇరవై ఏళ్లైనా ఏపీలో అభివృద్ధి జరగకపోయేదన్నారు. విభజన జరగకుంటే... జాతీయ విద్యాసంస్థలు వచ్చేవా, అంతర్జాతీయ స్థాయి అమరావతి సాధ్యమయ్యేదా అని ఆలోచించాలని సీమాంధ్రులకు సూచించారు.