ఎన్నికల్లో కేసీఆర్కు చుక్కలు, వంటేరును తుదముట్టించాలని కేసీఆర్: సంచలన ఆరోపణ
హైదరాబాద్: గజ్వెల్ తెలుగుదేశం పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డికి పెరుగుతున్న జనాధరణ చూసి తట్టుకోలేక కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ బుధవారం విమర్శించారు.
వంటేరును అక్రమంగా అరెస్టు చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురువారం సాయంత్రం లోగా వంటేరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన చెప్పారు.
ఎల్ రమణ హెచ్చరిక
వంటేరు, ఓయు విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోకుంటే శుక్రవారం ప్రగతి భవన్ ఎదుట ధర్నా చేపడతామని ఎల్ రమణ హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ
మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావులు కంకణం కట్టుకొని మరీ అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఎల్ రమణ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో కేసీఆర్పై గజ్వెల్లో పోటీ చేసిన వంటేరుపై అక్రమ కేసులు తుద ముట్టించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు.
గవర్నర్ సమయం ఇవ్వట్లేదు
ఒంటేరు అరెస్టుపై చర్చించడానికి తాము సమయం కోరుతున్నప్పటికీ గవర్నర్ నరసింహన్ అవకాశం ఇవ్వడం లేదని ఎల్ రమణ ధ్వజమెత్తారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అంతర్జాతీయ టెర్రరిస్టు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మరో తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో పోటీ
కాగా, వంటేరు ప్రతాప్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో గజ్వెల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్ పైన పోటీ చేశారు. ఓ విధంగా కేసీఆర్కు చుక్కలు చూపించారు. ఆయనకు స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. దీంతో ఆయన కేసీఆర్ ఓడిపోవడం లేదా తక్కువ మెజార్టీతో గెలుస్తారని జోరుగా ప్రచారం సాగింది. ఓ విధంగా వంటేరు.. కేసీఆర్కు చుక్కలు చూపించారని అంటారు.