లోకసభ ఎన్నికలు 2019: నాగర్కర్నూల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నాగర్కర్నూల్ జిల్లాగా ఏర్పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య 16 వేల 676 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మందా జగన్నాథంపై విజయం సాధించారు. నంది ఎల్లయ్యకు 420,075 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథంకు 403,399 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బక్కాని నర్సింహులుకు 1,83,312 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి బహద్దూర్ శ్రీనివాస్ 12,089 ఓట్లు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మారెడు గోపాల్కు 22,985 ఓట్లు, స్వతంత్ర్య అభ్యర్థి బుద్దుల శ్రీనివాస్ 54,680 ఓట్లు పోలయ్యాయి.
76 సంవత్సరా వయస్సు ఉన్న నంది ఎల్లయ్య పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇది ఆరోసారి. 2014 మే 18 తేదీన ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. ఇప్పటి వరకు పార్లమెంట్లో పలు అంశాలపై జరిగిన చర్చల్లో 7 సార్లు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి 36.7 శాతం మేర ప్రశ్నలు లేవనెత్తగా, జాతీయ స్థాయి అంశాలపై 63 శాతం మేర తన గళాన్ని వినిపించారు. నియోజకవర్గం అభివృద్ది కోసం 25.55 కోట్ల ఎంపీ ల్యాడ్ నిధులు మంజూరు కాగా, 19.25 కోట్లు మేర ఖర్చు చేశారు.
షెడ్యూల్ కులాల (ఎస్సీ) రిజర్వుడు స్థానమైన నాగర్కర్నూల్లో మొత్తం 20 లక్షల 44 వేలకుపైగా జనాభా ఉంది. ఇందులో సుమారు 90 శాతం మంది గ్రామీణ ప్రాంత వాసులే ఉన్నారు. 10 శాతం మేర నగర జనాభా ఉంది. మొత్తం జనాభాలో 20 శాతం షెడ్యూల్ కులాలా వారు ఉండగా, 10 శాతం మేర షెడ్యూల్ జాతుల (ఎస్టీ) వారు ఉన్నారు. నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
2014 లోక్సభ ఎన్నికలకు ముందు ఉన్న గణాంకాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 1,477,338 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషుల ఓట్లు 745,038 కాగా, మహిళల ఓట్లు 732,300 ఉన్నాయి. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 75 శాతం మేర అంటే 1,108,968 ఓట్లు పోలయ్యాయి. అందులో పురుషుల ఓట్లు 570,342 కాగా, మహిళల ఓట్లు 538,626 పోలయ్యాయి.
2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మంద జగన్నాథం తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై 47,767 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 10,25,367 ఓట్లు పోలవ్వగా, మందా జగన్నాథానికి 4,22,745 ఓట్లు, గువ్వల బాలరాజుకు 3,74,978 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దేవాని సత్యనారాయణకు 62,216 ఓట్లు వచ్చాయి.
2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంద జగన్నాథం తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై 99,650 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 883,350 ఓట్లు పోలయ్యాయి. అందులో మందా జగన్నాథానికి 405,046 ఓట్లు పోలవ్వగా, కేఎస్ రత్నంకు 305,396 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి భగవంతుకు 119,813 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి పీ లాలయ్యకు 27,247 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ జీ రాఘవులుకు 25,848 ఓట్లు పోలయ్యాయి.