కేసీఆర్కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం
'మూడెకరాలు అంటివి.. ఆరడుగులు ఇస్తివి..' నిన్నటి మంథని నిరసన కార్యక్రమంలో ఈ నినాదం మారుమోగింది. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ హామిని ఎద్దేవా చేస్తూ దళిత సంఘాలన్ని ఈ నినాదం చేశాయి.
మంథని/హైదరాబాద్: బహుశా తెలంగాణ ఉద్యమం తర్వాత.. మరోసారి రాష్ట్రంలో ఉవ్వెత్తున ఓ నిరసన జ్వాల ఎగసిపడటం ఒక్క మంథని ఘటనలోనే జరిగింది. ఒక్క సోషల్ మీడియా పిలుపుతో వేలాది జనం మంథనికి తరలివచ్చారు. దళిత సంఘాలు, ప్రజాస్వామిక వాదుల ఐక్య నిరసనతో మంథని దద్దరిల్లింది. 'మధుకర్'ది అనుమానస్పద మృతి కాదని, కచ్చితంగా ఇది కులం కోణంలో జరిగిన హత్యేనని న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని వారంతా తెగేసి చెప్పారు.
దాదాపు ఐదుగంటల పాటు మండుటెండను లెక్క చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనం నిరసనలో పాల్గొన్నారు. కి.మీ పొడవునా వాహనాలు రోడ్ల పైనే నిలిచిపోయాయి. పోలీసులు చెప్పే సమాధానాలకు శాంతించని దళిత సంఘాలు కమిషనర్ రావాల్సిందేనని పట్టుబట్టాయి. చివరకు ఏసీపీ సింధుశర్మ రాకతో.. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రీపోస్టు మార్టంతో పాటు, ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన స్థానిక సీఐని కేసు నుంచి తప్పించి, తానే ఈ కేసును డీల్ చేస్తానని సింధుశర్మ హామి ఇచ్చారు.
ఎవరూ పట్టించుకోకపోయినా:
మధుకర్ మర్డర్ మిస్టరీకి సంబంధించి ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు నోరు మెదపడం లేదు. కేసులో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు ఉండటంతో.. పాలకవర్గాలు కావాలనే ఈ కేసును కప్పిపుచ్చుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి ప్రచారం కల్పించకుండా అటు మీడియాను సైతం మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నినాదాలతో మారుమోగిన మంథని:
'మూడెకరాలు అంటివి.. ఆరడుగులు ఇస్తివి..' నిన్నటి మంథని నిరసన కార్యక్రమంలో ఈ నినాదం మారుమోగింది. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ హామిని ఎద్దేవా చేస్తూ దళిత సంఘాలన్ని ఈ నినాదం చేశాయి. మంథని ఘటనలో స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం ఉండటంతోనే కేసును పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాలకవర్గాలు పోలీసు వ్యవస్థతో కలిసి కుట్ర చేశాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద మంథని ఘటన ప్రభుత్వం పట్ల దళితుల్లో వ్యతిరేకతను గూడుకట్టుకునేలా చేసింది.
కేసులో న్యాయం జరగకపోతే!:
ఒక్క సోషల్ మీడియా పిలుపుతోనే జనం ఇంతలా ఐక్యమవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం గనుక ఈ కేసులో పారదర్శకంగా వ్యవహరించకపోతే ఈ వ్యతిరేకత మరింత పెల్లుబికడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే గనుక జరిగితే టీఆర్ఎస్ కు దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామిని విస్మరించిన కేసీఆర్ కు.. మంథని ఘటన కూడా మరో పెద్ద దెబ్బలా పరిణమిస్తుందనడంలో అతిశయోక్తి లేదేమో!
మంథని చరిత్రలోనే అతిపెద్ద నిరసన:
మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో ఆర్డీవో ఆఫీసు నుంచి దళిత సంఘాలు ర్యాలీగా అంబేడ్కర్ చౌక్ వద్దకు బయలుదేరాయి. భారీ ఎత్తున తరలివచ్చిన జనమంతా రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వేలాది జనం నినాదాలతో హోరెత్తించారు. మధుకర్ కు న్యాయం జరిగి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మధుకర్ తల్లిదండ్రులు, అన్నదమ్ములు పాల్గొన్నారు.
పసునూరి, గిద్దె రామనరసయ్యల పాట:
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న క్రమంలో బహుజన రచయిత పసునూరి రవీందర్ తన పాటతో ఉర్రూతలూగించారు. సందర్భోచితంగా ఆయన పాడిన పాటలు నిరసనకారులతో పాటు స్థానికులను సైతం ఆకట్టుకున్నాయి. అంతకుముందు గిద్దె రామనరసయ్య సైతం తన పాటలతో నిరసనకు ఊపు తెచ్చారు.
వేలాది జనం నిరసన ముందు పోలీసులు నిశ్చేష్టుల్లా మిగిలిపోయారు. నిరసనకారులను వారు సముదాయించే ప్రయత్నం చేసినా.. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారంటూ దళిత సంఘాలన్ని నిలదీయడంతో వారు సైలెంట్ అయిపోయారు.
రంగంలోకి ఏసీపీ:
స్థానిక పోలీసులు చేతులెత్తేయడంతో పెద్దపల్లి ఏసీపీ సింధుశర్మ మంథనికి వచ్చారు. నిరసనకు నాయకత్వం వహిస్తున్నవాళ్లు డిమాండ్ల గురించి తనతో మాట్లాడాల్సిందిగా చెప్పడంతో.. సామాజికవేత్త ఉసా, ప్రొఫెసర్ కదిరె కృష్ణ సహా పలువురు ఏసీపీతో చర్చలు జరిపారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చడంతో పాటు, మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియో రికార్డింగ్ సహకారంతో రీ-పోస్టు మార్టమ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్స్ కు ఏసీపీ ఒప్పుకోవడంతో నిరసనను తాత్కాళికంగా విరమించుకున్నారు.
స్థానికుల మద్దతు:
స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పట్ల ఉన్న వ్యతిరేకత కూడా నిన్నటి మంథని నిరసనలో స్పష్టంగా కనిపించింది. నిరసన సమయంలో పలువురు స్థానికులు ఆయన పట్ల వ్యతిరేకతను బయటపెట్టారు. పలువురు దళిత సంఘాల యువకులు ఫ్లెక్సీలను చింపివేస్తున్న క్రమంలో.. స్థానికులు సైతం ఈ చర్య పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
విచారణ సరిగా లేకపోతే:
ఏసీపీ సింధు ఇచ్చిన హామి మేరకు విచారణ గనుక పారదర్శకంగా జరగకపోతే మరోసారి దళిత సంఘాలు తిరుగుబాటు చేసే అవకాశముంది. ఇప్పటిదాకా దీనిపై నోరుమెదపని ప్రభుత్వం విచారణ పట్ల ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగితే గనుక మరోసారి దళిత సంఘాల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.
ఎవరెవరొచ్చారు:
మధ్యాహ్నాం ఆర్డీవో ఆఫీసు వద్ద పలువురు దళిత సంఘాల ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల నేతలు మధుకర్ తల్లిదండ్రులను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం మధుకర్ తల్లిదండ్రులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్, సామాజికవేత్త ఉసా, ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, ప్రొఫెసర్ కదిరె కృష్ణ, బహుజన రచయిత పసునూరి రవీందర్, స్కాలర్ గుర్రం సీతారాములు, బీఎస్పీ నాయకురాలు అరుణ క్వీన్, ఎమ్మార్పీఎస్ నాయకులు, సహా పలువురు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 48దళిత సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి.
ఖండించిన ఎమ్మెల్యే పుట్ట మధు:
మధుకర్ హత్య కేసులో ఎమ్మెల్యే పుట్ట మధు పట్ల తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో తొలిసారిగా ఆరోపణల పట్ల ఆయన స్పందించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుట్ర ఉందని, ఆయన చేసిన కుట్ర వల్లే హత్యను రాజకీయం చేశారని పుట్టు మధు ఆరోపిస్తున్నారు. ప్రజాసంఘాల ఆరోపణలను పుట్ట మధు తప్పుపట్టారు.