హెల్మెట్ లేనందుకు మేయర్ బొంతుకు రూ.100 ఫైన్, కెసిఆర్ రికార్డ్
హైదరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్కు ట్రాఫిక్ పోలీసులు రూ.100 జరిమానా విధించారు. అతను ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా.. హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో అతనికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆయన నగర సమస్యలు తెలుసుకునేందుకు టూ వీలర్ పైన ప్రయాణించారు.
ప్రసంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమంలో, నేడు ప్రభుత్వంలోనూ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సుదీర్ఘ సమయం తీసుకుని మంత్రివర్గ సమావేశాలు జరిపిన సీఎం.. నేడు ఏకధాటిగా మూడు గంటలకు పైగా ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
తెలంగాణ జల విధానంపై శాసనసభలో సీఎం కేసీఆర్ మూడు గంటలకు పైగా వివరణ ఇచ్చారు. ఉదయం 11.45 గంటల సమయంలో ప్రారంభమైన ప్రసంగం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ముగిసింది. శాసనసభలో వరుసగా మూడు గంటలు ఏ సీఎం మాట్లాడినా దాఖలాలు లేవంటున్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంటే ముందు సుమారు అర గంటకు పైగా సాగునీటి ప్రాజెక్టులపై ఉపోద్ఘాతం ఇచ్చారు.
అనంతరం సభలో ఏర్పాటు చేసిన మూడు ఎల్ఈడీ స్క్రీన్లపై సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం, ఏయే ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? కర్ణాటక, మహారాష్ట్ర ఎన్ని బ్యారేజీలు నిర్మించింది? గతంలో ఏ విధంగా మోసం జరిగింది? ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల జరిగే లాభాలు, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తే కోటి ఎకరాలకు సాగు నీరు వస్తుందనే విషయంపై సవివరంగా వివరణ ఇచ్చారు.