ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్, ఛైర్మన్ బాజిరెడ్డి ఏమన్నారంటే?: రూ. 850 కోట్ల ఆదాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రయాణికులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. అయితే, భారీ నష్టాల్లో ఉన్న సంస్థను గట్టిక్కించేందుకు ఛార్జీలను పెంచడం తప్ప మరో మార్గం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రయాణికులు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతోంది. ఈ మేరకు బుధవారం కీలక సమావేశం జరిగింది.
ఆర్టీసీ ఛార్జీల పెంపు ఎంతంటే?
ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ లతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని తెలిపారు. పల్లె వెలుగుకు కిలోమీటర్కు 25 పైసలు, మిగితా సర్వీసులకు 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
ఆర్టీసీ నస్టాలు తగ్గించాలంటే ఛార్జీలు పెంచాల్సిందే..
బస్సు ఛార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగి పెరిగిపోయిందన్నారు. ఈ మూడేళ్లలో ఆర్టీసీకి రూ. 4,260 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలిపారు. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడిందని వెల్లడించారు.
పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో రూ. 850 కోట్ల ఆదాయం
తెలంగాణ ఆర్టీసీకి 2018-19 ఆర్టిక సంవత్సరంలో రూ. 4882 కోట్లు ఆదాయం రాగా, ఖర్చు 5811 కోట్లకు చేరుకుందని తెలిపారు. అదే విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 4592 కోట్లు ఆదాయం రాగా, ఖర్చు 5594 కోట్లకు చేరిందని చెప్పారు. దీంతో రూ. 1002 కోట్ల నమోదైందని తెలిపారు. 2020-21లో ఆర్టీసీ ఆదాయం రూ. 2455 కోట్లు ఉంటే.. ఖర్చు 4784 కోట కోట్లకు చేరింది. దీంతో రూ. 2329 కోట్లు నష్టం వచ్చింది. ఒకవేళ ఛార్జీలు పెంచితే ఆర్టీసీకి ఏడాదికి రూ. 850 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
Recommended Video
ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలన్న బాజిరెడ్డి
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సమీక్ష సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్కు నివేదించామని ఆయన తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్కు 25 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాగా, ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.