మాదే అసలు టిడిపి: అసలుకే ఎసరుబెట్టిన ఎర్రబెల్లి, కెసిఆర్ ప్లాన్ ఏమిటి?
హైదరాబాద్: సభాపతి మధుసూదనా చారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాశారు. తమదే అసలైన టిడిపిగా గుర్తించాలని, 2/3 ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి శాసన సభలో తమనే అసలైన టిడిపిగా గుర్తించాలని కోరారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఇప్పుడు ఆ పార్టీకి మిగిలింది కేవలం అయిదుగురే.
కేపీ వివేకానంద, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డిలు కారు ఎక్కారు. మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్యలు మిగిలారు. ఇందులో ఆర్ కృష్ణయ్య తనకు టిడిపితో సంబంధం లేదని చెబుతున్నారు.
కెసిఆర్ ప్లాన్ ఏమిటి?
మెజార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరినందున.. తెలంగాణలో టిడిపి శాసనసభలో ప్రాతినిత్యం లేకుండా చేయాలని సీఎం కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ఉద్దేశ్యంతోనే ఎర్రబెల్లిచే లేఖ ఇప్పించారని అంటున్నారు.
15 మందిలో 10 మంది చేరినందున తమను అసలైన టిడిపిగా గుర్తించాలని ఎర్రబెల్లి లేఖ రాశారు. అసలైన టిడిపిగా వారిని గుర్తించిన అనంతరం.. తాము తెరాసలో చేరుతున్నట్లు, తమను విలీనం చేయాలని ఎర్రబెల్లి కోరనున్నారు. అప్పుడు శాసన సభలో టిడిపికి ఎమ్మెల్యేలు లేకుండా పోతారు.
ఇప్పటికీ టిడిపిలోనే ఉన్న ఎమ్మెల్యేలు స్వతంత్రులు అవుతారు. వారికి ఇష్టం ఉంటే టిడిపితోనే ఉండవచ్చు. అయితే, తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీకి వచ్చే అవకాశాలు లేకుండా పోతాయి. అందుకోసమే కెసిఆర్.. ఎర్రబెల్లితో లేఖ ఇప్పించారని అంటున్నారు. అయితే, చట్టపరంగా చెల్లుతుందా పూర్తిగా తేలాల్సి ఉంది. 10వ షెడ్యూల్ ప్రకారం.. ఒరిజినల్ టిడిపి సభ్యులు పార్టీతోనే ఉండవచ్చునని చెబుతోందని తెలుస్తోంది.
మరోవైపు, ఎర్రబెల్లి లేఖ వెనుక కెసిఆర్ వ్యూహం మరొకటి కూడా ఉండవచ్చునని అంటున్నారు. ఎర్రబెల్లి లేఖ ద్వారా స్పీకర్ పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలను టిడిపి వారిగా గుర్తించాక.. మిగతా అయిదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా పోతారు. అప్పుడు ఈ పదిమంది (టిడిపి ఎమ్మెల్యేలుగా గుర్తించబడిన) ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉంటారు.