బిజెపిలో ముసలం: రియల్ దందా, కిషన్ని తప్పించండి.. రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిచ్చు రాజుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పైన అదే పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథ్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశానని చెప్పారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావాలంటే ఆయనను తప్పించాలని అమిత్ షాకు రాసిన లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు.
అధ్యక్షుని నియంతృత్వ విధానాలపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజాసింగ్ అన్నారు. పార్టీ నేతలను గానీ, కార్యకర్తలనుగానీ ఆయన కలుపుకొని పోవడం లేదన్నారు. మధుగౌడ్ను పార్టీలోకి తీసుకోవద్దని ఎంత మంది చెప్పినా వినలేదు, మధుగౌడ్తో తన నియోజక వర్గంలో ఇబ్బందులొస్తాయని చెప్పినా వినలేదన్నారు.
పైగా నీ పని నువ్వు చూసుకో అంటూ ఖాతరు చేయలేదు రాజాసింగ్ తన ఆవేదనను వెల్లడించారు. పార్టీని పక్కన పెట్టి కిషన్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, భూ కబ్జాదారుడు మధుగౌడ్ను పార్టీలోకి తీసుకున్నది అందుకేనని తీవ్ర ఆరోపణలు చేశారు.
కిషన్ రెడ్డి తీరుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ అధ్యక్షులు అమిత్షాకు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ చెప్పారు. హిందూ భక్తలకు కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఏమైనా తినొచ్చని, బీఫ్ తినడాన్ని తప్పు పట్టట్లేదని, నరేంద్ర మోడీకి సైతం బీఫ్ తింటే అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బీఫ్ ఫెస్టివెల్ పైన...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివెల్ పైన రాజాసింగ్ మరోసారి స్పందించారు. తాము ఓయూలో జరిగే బీఫ్ ఫెస్టివెల్కు కచ్చితంగా అడ్డుకొని తీరుతామి చెప్పారు.