వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి!: బాబుకు 'జూనియర్' చిక్కు, ఎమ్మెల్యే అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పార్టీ పదవుల పంపకం చిక్కులు తెచ్చి పెట్టినట్లుగా కనిపిస్తోంది. జూనియర్లకు చోటిచ్చారని సీనియర్లు పలువురు అలక వహించినట్లుగా తెలుస్తోంది.
పార్టీ పదవుల పైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నిరసన గళం విప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు కమిటీల కార్యవర్గాలను బుధవారం ఉదయం ప్రకటించారు.
తెలంగాణ కమిటీలో సాయన్నకు ఉపాధ్యక్ష పదవి దక్కింది. దీనిపై సాయన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముప్పై ఏళ్ల పాటు పార్టీని నమ్ముకుని పని చేస్తున్న తన సీనియారిటిని పరిగణనలోకి తీసుకుని పొలిట్ బ్యూరోలో అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందని ఆయన భావించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీలో సాయన్నను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తన సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అధిష్ఠానం జూనియర్లతో కలిపి ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టిడిపికి ఒక కేంద్రకమిటీ, రెండు రాష్ట్ర కమిటీలను నియమించినట్లు చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీల వివరాలను చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 17 మంది సభ్యులతో కేంద్ర పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు: మండవ వెంకటేశ్వర రావు, సాయన్న, అన్నపూర్ణమ్మ, వంగాల స్వామిగౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేశ్ రెడ్డి, కృష్ణ యాదవ్, అరికపూడి గాంధీ.
ప్రధాన కార్యదర్శులు: కొత్తకోట దయాకర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీతక్క, కెపి వివేక్ గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, రజనీకుమారి, నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, సతీష్ మాదిగ, అమర్నాథ్ బాబు.