ఎమ్మెల్యేల ఎరకేసు: జైలు నుండి సింహయాజీ విడుదల; నందకుమార్, రామచంద్రభారతి జైల్లోనే.. కారణమిదే!!
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కీలక పాత్ర పోషించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ కేసులో నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు నిందితులుగా చంచల్ గూడా జైలులో ఉన్నారు. అయితే ఇటీవల వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్యేల ఎరకేసు నిందితులకు షరతులతో కూడిన బెయిల్
సిట్ అధికారులు వారికి బెయిల్ మంజూరు చెయ్యొద్దని, బయటకు వెళ్తే వాళ్ళు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించినప్పటికీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులలో భాగంగా ప్రతి సోమవారం సిట్ ముందుకు హాజరు కావాలని, ఎట్టి పరిస్థితులలోనూ దేశం విడిచి వెళ్లొద్దని, ముగ్గురు పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలని పేర్కొంది. అంతేకాదు మూడు లక్షల పూచీకత్తుపై వారు ముగ్గురికి బెయిల్ ను మంజూరు చేసింది.
నేడు చంచల్ గూడా జైలు నుండి విడుదలైన సింహయాజీ స్వామీజీ
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటీవల బెయిల్ పొందిన నిందితుల్లో ఒకరైన సింహయాజీ స్వామి ఈ రోజు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఏ 3 నిందితుడిగా ఉన్న సింహయాజీకి షూరిటీల చెల్లింపులో ఆలస్యం కావడంతో విడుదలకు ఆటంకం ఏర్పడింది. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వారం రోజుల తర్వాత సింహయాజి స్వామీజీ విడుదలయ్యారు.
వారిపై పెండింగ్ కేసులు ... ఆ ఇద్దరూ ఇంకా జైల్లోనే
రామచంద్ర భారతి, నందకుమార్ లకు కూడా బెయిల్ లభించగా వారు విడుదల అవుతారని భావిస్తే వారిద్దరిపై వేర్వేరు కేసులు కూడా ఉండటంతో ఇద్దరు జైలులోనే ఉండాల్సి వచ్చింది. రామచంద్ర భారతి మరో నకిలీ పాస్ పోర్ట్ కేసులో, నంద కుమార్ పై చీటింగ్ కేసులు ఉండటం తో వారు ఇంకా పెండింగ్ లో ఉన్న కేసుల వల్ల బయటకు రాలేదు. వారిరువురూ ప్రస్తుతం చంచల్ గూడా జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఏ 3 నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామి మాత్రం నేడు జైలు నుండి బయటకు వచ్చారు.
ఏసీబీ కోర్టులో సిట్ అధికారులకు షాక్... హైకోర్టులో రివిజన్ పిటీషన్
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు ఉన్నారని వారిని కూడా విచారించాలని సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, అడ్వకేట్ శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వారిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. ఇక ఏసీబీ కోర్టు సిట్ దాఖలు చేసిన మెమోను తిరస్కరించడంతో, దానిని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. సిట్ అధికారులకు ఈ కేసులో దర్యాప్తును పక్కన పెట్టి కోర్టుల చుట్టూ తిరగడం సరిపోతుంది. దూకుడుగా ఈ కేసును విచారించాలని భావించిన సిట్ కు అడుగడుగునా ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు.